పత్తిపాటి లేదా జగన్.. సభలో ఒకరే ఉండాలి, తప్పు రాస్తే చర్యలే: బాబు హెచ్చరిక
సభలో ఆరోపణలు చేసి వెళ్లిపోవడం కాదని, అసెంబ్లీలో ఉంటే వైసిపి అధినేత జగన్ ఉండాలి లేదా మంత్రి పత్తిపాటి పుల్లారావు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు.
అమరావతి: సభలో ఆరోపణలు చేసి వెళ్లిపోవడం కాదని, అసెంబ్లీలో ఉంటే వైసిపి అధినేత జగన్ ఉండాలి లేదా మంత్రి పత్తిపాటి పుల్లారావు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు.
స్పీకర్ కోడెల ప్రసాద రావు మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో మాట్లాడిన వీడియోను ప్రసారం చేసిన అనంతరం పలువురు సభ్యులు సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అనంతరం చంద్రబాబు అగ్రిగోల్డ్ పైన మాట్లాడారు.
పత్తిపాటి సవాల్ను స్వీకరించకపోవడం జగన్ పిరికితనమో, కాదో ఆయనకే వదిలేస్తున్నామన్నారు. అగ్రిగోల్డ నిందితులను పట్టించిన వారికి రూ.25 లక్షల బహుమతి అన్నారు. సభాపతిపై తప్పుడు ప్రసారాలు చాలా దారుణం అన్నారు. ఇప్పుడు స్పీకర్ మాట్లాడిన మాటలకు చెందిన క్లిప్పింగును రేపు (శుక్రవారం) మరోసారి వేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.
జ్యూడిషియల్ విచారణకు సిద్ధమన్నా..
మంత్రి పుల్లారావు చేసింది తప్పయిందే ఈయనను సభ నుంచి బహిష్కరిస్తామని, అలాగే జగన్ చెప్పింది అవాస్తవమయితే ఆయనను బహిష్కరిస్తామని స్పష్టంగా చెప్పామన్నారు. జ్యూడిషియల్ విచారణకు సిద్ధమని చెప్పామన్నారు.
అగ్రిగోల్డ్ పైన జ్యూడిషియల్ విచారణకు సిద్ధమని చెప్పినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేసిందన్నారు. సభలో పత్తిపాటి లేదా జగన్ ఎవరో ఒకరు ఉండాలన్నారు. ఎవరు తప్పు చేస్తే వారిని వెలివేద్దామన్నారు.
ఆధారాలు లేకుండా రాస్తే చర్యలు తీసుకునే హక్కు
ఆధారాలు లేకుండా కథనాలు రాస్తే సభకు చర్యలు తీసుకునే అధికారం ఉందని చంద్రబాబు చెప్పారు. సభాపతిపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం, రాయడం చాలా దారుణమని చెప్పారు.
గత కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతిపరులు రెచ్చిపోయారన్నారు. వైసిపి సభలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో దోషులను వదిలి పెట్టేది లేదని చెప్పారు. ఫ్రాడ్ చేసిన వ్యక్తిని వదిలేది లేదన్నారు.
అగ్రిగోల్డ్ నుంచి ప్రతి పైసా రాబడతాం
అగ్రిగోల్డ్ వ్యవహారంలో లక్షల మంది బాధ అని, వారి బాధ మాకు తెలుసునని, అందుకు కారణమైన వారిని తప్పకుండా శిక్షిస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు శిక్షిస్తామని, ప్రతి పైసా రాబడుతామని చంద్రబాబు చెప్పారు. అరెస్టులు జరిగాయని, ఇంకా 11 మందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
అసెంబ్లీలో ఇష్టానుసారం మాట్లాడటం పరిపాటి అయిందని మండిపడ్డారు. పత్తిపాటి, జగన్ వాదనలను ప్రజలు చూశారని, ఆరోపణలు చేసి వెళ్లిపోవడం సరికాదన్నారు. రేపు కూడా సభలో ఈ విషయాలు చర్చించాల్సిందే అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు.
బాధితులకు రూ.5 లక్షల నష్ట పరిహారం
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. అగ్రిగోల్డ్ మాత్రమే కాకుండా.. ఏ ఫైనాన్స్ కంపెనీ లేదా చిట్ ఫండ్ కంపెనీ అన్యాయం చేసినా శిక్షిస్తామన్నారు. భవిష్యత్తులో ఎవరైనా తప్పుడు పనులు చేయాలంటే భయపడేలా శిక్షిస్తామని చంద్రబాబు చెప్పారు. ఏపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని చెప్పారు.