అండగా ఉందాం: కేరళ సీఎంకు చంద్రబాబు ఫోన్, కలచివేసిందంటూ జగన్ పిలుపు
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ట్రాలు కేరళకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం కూడా రూ. 10 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. ఎలాంటి సాయం చేసేందుకైనా తాము సిద్ధమని ఈ సందర్భంగా చెప్పారు.
మంగళగిరిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఇప్పటికే కేరళకు ఏపీ ప్రభుత్వం పంపింది. దీంతో పాటు ఆహార పదార్థాలు, పాలు, పండ్లు, బిస్కెట్లను పంపనుంది. విపత్తు నుంచి కేరళ త్వరగా బయటపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కలచివేసిందంటూ వైయస్ జగన్
The devastation caused by the #KeralaFloods is gut-wrenching. My thoughts & prayers are with the people of Kerala in these testing times. Urge the Central govt to provide all possible assistance to support relief & rehabilitation measures for people affected by this calamity.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 18, 2018
కేరళ పరిస్థితిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వరద విపత్తు హృదయాన్ని కలిచివేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఈ కష్టకాలంలో తన ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయని అన్నారు. విపత్తుతో తల్లిడిల్లుతున్న కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
గత వందేళ్లలో ఎన్నడూలేనివిధంగా భారీ వరదలు ముంచెత్తడంతో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. త్రివిద దళాల నేతృత్వంలో 1300 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వేలాది మందిని సురక్షితంగా కాపాడారు.