ఇవన్నీ మీ బాధ్యత, మేం లెక్క చెప్పలేదా: జైట్లీకి బాబు షాక్, ఇదీ పోలవరం లెక్క
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ఆర్థిక లోటు, విశాఖ రైల్వే జోన్ తదితర అంశాలపై మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడారు.
హోదా మా హక్కు, ఎందుకివ్వరని నేను నిలదీస్తున్నా: అసెంబ్లీలో మోడీపై చంద్రబాబు
విభజన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడే ప్రసక్తి లేదని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా దెబ్బతిన్న ఏపీ ప్రజల హక్కు అని చెప్పారు. కేంద్రం సహకరిస్తే ఏపీ వేగంగా అభివృద్ధి చెందేదని చెప్పారు. తాము ఏదీ అదనంగా అఢగలేదన్నారు. విభజన చట్టంలో ఉన్నవే అడుగుతున్నామని చెప్పారు.
బీజేపీ తప్పించుకోవాలని చూస్తే
బీజేపీ తప్పించుకోవాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. విభజన హామీలను నెరవేరుస్తామని అరుణ్ జైట్లీ చెప్పారని, తాము అవే అడుగుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏపీకి ఇవ్వమని నీతి అయోగ్ చెప్పిందన్నారు. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు.
నేను కేంద్రాన్ని నిలదీశా
తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానని గుర్తు చేశారు. ఏపీకి హోదా ఇవ్వమంటే మూడు కీలక సందర్భాల్లో హోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరని తాను కేంద్రాన్ని నిలదీశానని చెప్పారు. తాము పరిపాలనా వ్యయాన్ని తగ్గించుకొని సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. హోదా, విభజన హామీల కోసం తాను పదేపదే విజ్ఞప్తి చేశానని, ఎంపీలను పంపించానని చెప్పారు.
కొందరు సూసైడ్ నోట్ రాసుకున్నారు
గతంలో ప్రత్యేక హోదాపై పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందన్నారు. కొంతమంది సూసైడ్ నోట్ రాసి పెట్టుకున్నారని చెప్పారు. ప్రధాని రమ్మని చెబితే ఢిల్లీ వెళ్లి సమాచారం ఇచ్చామని చెప్పారు. అన్ని రకాల వ్యవసాయ రుణాలు రద్దు చేశామన్నారు. డిస్కంలకు నిధులు ఇచ్చామన్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం నిధులు కేటాయించామన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు మీద
ఈ సందర్భంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చు, కేంద్రం ఇచ్చిన నిధులను వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం తాను ప్రతి సోమవారం పోలవారంగా సమీక్షిస్తున్నానని చెప్పారు. పోలవరంకు జనవరి వరకు రూ.7వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం నుంచి రూ.5,349 కోట్లు వచ్చిందన్నారు. మరో రెండువేల కోట్లకు పైగా పెండింగులో ఉన్నాయన్నారు. పోలవరం ఏపీకి ఓ వరం అన్నారు.పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.58వేల కోట్లు అని చెప్పారు. మనం చేసిన ఖర్చులో రూ.2566 కోట్లు రావాలన్నారు. పోలవరం అథారిటీకి ఎప్పటికప్పుడు లెక్కలు పంపిస్తున్నామని చెప్పారు. పట్టిసీమతో 100 టీఎంసీలు కృష్ణా డెల్టాకు నీరు తరలించామన్నారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చారని, వాటికి లెక్కలు చెప్పామన్నారు. నేను ఎక్కడా తప్పు చేయలేదని, తనపై ఒక్క కేసు లేదన్నారు. దుగరాజుపట్నం సాధ్యం కాదని చెబుతున్నారని, ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.
రూ.12వేల కోట్ల లెక్కలు.. లెక్కలు పంపించాం
రెవెన్యూ లోటు అడిగితే లెక్కలు అడగడం విడ్డూరమన్నారు. కాగ్ చెప్పిన ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేయాలన్నారు. 16వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని కేంద్రానికి నివేదిక పంపిస్తే, రూ.3,900 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రూ.12వేల కోట్లు ఇచ్చామని, లెక్కలు చెప్పలేదని కేంద్రం అడుగుతోందని, కానీ అన్ని లెక్కలను పంపించామని చెప్పారు. (లెక్కలు పంపించలేదని జైట్లీ అన్నారు) వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలను కేంద్రం భరిస్తుందని అప్పుడు చెప్పారన్నారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అన్నారని చెప్పారు. పింఛన్ నిధులను లోటు బడ్జెట్లో చేర్చారని చెప్పారని, ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకొని పింఛన్లు ఇచ్చామన్నారు. పింఛన్, రుణమాఫీ నిధులను రెవెన్యూ లోటులో చేర్చలేదన్నారు.
విశాఖ రైల్వే జోన్
ఏపీకి రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు. కానీ దానిని అమలు చేయలేదన్నారు. విసాఖ రైల్వో జోన్ డిమాండ్ చేస్తున్నామన్నారు. కాగ్ ఇచ్చిన లెక్కలు సరిగా లేవని చెప్పడం సరికాదన్నారు. మొదటి సంవత్సరం ఆర్థిక లోటునే ఇప్పటి వరకు భర్తీ చేయలేదన్నారు. ఆర్థిక లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఎడారిగా ఉన్న అనంతపురాన్ని పూర్తిగా రక్షించుకోగలిగామన్నారు.
అమరావతిని ఇండియాలో నెంబర్ వన్ రాజధానిగా
ఏపీలో హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. అమరావతిని ఇండియాలోనే నెంబర్ వన్ చేస్తామన్నారు. మోడీ కూడా ఇందుకు సహకరిస్తామని తిరుపతిలో చెప్పారన్నారు. రెండు మున్సిపాలిటీలకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పారన్నారు. ట్రైబల్ వర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటికీ ఇంకా బిల్లులే పాస్ కాలేదన్నారు. మొత్తంగా 11 సంస్థలకు మనం 11,వేల కోట్లకు పైగా భూములు ఇచ్చామని, కేంద్రం నాలుగు వందలకు పైగా ఇచ్చిందని చెప్పారు. ఒక్క పైసా ఖర్చు లేని నియోజకవర్గాల పెంపును పట్టించుకోవడం లేదన్నారు. నేను అడిగితే సీట్ల గురించి అంటున్నారని, కానీ చట్టంలో పెట్టింది అమలు చేయలేదని చెప్పేందుకు అడిగానని తెలిపారు. దుగరాజుపట్నం పోర్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.