మెడికల్ హబ్గా ఏపీ: ఎయిమ్స్ను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఈ ఎయిమ్స్ మణిహారంలా ఉంటుందన్నారు.
భారదేశంలో ఉండే డాక్టర్లు చాలా మంది అమెరికాకు వెళ్లారు. అందులో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే గుంటూరు మొదటి స్ధానంలో ఉంది. అందుకు కారణం గుంటూరు మెడికల్ కాలేజేనన్నారు. అమెరికాలో ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు సాధించారన్నారు.
నిపుణులైన వైద్యులు ఇక్కడ ఉండడం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమన్నారు. పేదవాడి ఆరోగ్యం మెరుగుదలకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం సహకరిస్తే మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న ఈ ఎయిమ్స్ను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుతామన్నారు. ఆంధ్రప్రదేశ్కే ఈ ఎయిమ్స్ గర్వకారణమని ఆయన తెలిపారు.
వైద్య రంగానికి కేంద్రంలా అమరావతి రూపుదిద్దుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో రెండు క్యాన్సర్ ఆసుపత్రులు స్థాపించడానికి ముందుకొచ్చిన కేంద్రమంత్రి జేపీ నడ్డాను అభినందిస్తున్నానని తెలిపారు. మంగళగిరిలో స్థాపించనున్న ఈ ఎయిమ్స్ను కేంద్రం మూడేళ్లలోపూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకి చంద్రబాబు సూచించారు.
కేంద్రం గనుక ఈ ఎయిమ్స్కు పూర్తిగా సహకరిస్తే దేశంలోనే ఒక మోడల్ ఇనిస్టిట్యూట్గా తయారుచేస్తామన్నారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభమైన తర్వాత మన రాష్ట్రానికి చెందిన వారే కాకుండే విదేశాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకునే అవకాశం ఉందన్నారు.
ఇటీవల గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పునర్విభజన అనంతరం రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటుందన్నారు.
అన్న సంజీవని పెట్టి తక్కువ ధరకే జనరిక్ మెడిసన్ ఇచ్చేలా శ్రీకారం చుట్టామన్నారు. గర్భిణిల కోసం ప్రత్యేకంగా 102 కాల్ సెంటర్ను ప్రారంభించామని, అవసరమైతే చికిత్స అనంతరం వారిని తిరిగి క్షేమంగా ఇంటికి వద్ద దించేలాఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు భయంకరంగా ఉన్నాయని చెప్పిన ఆయన త్వరలో పీపీపీ పద్ధతి ద్వారా ప్రక్షాళన చేపట్టనున్నామన్నారు.
అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని, అంగన్వాడీల జీతాల పెంపు వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.311 కోట్ల భారం పడుతుందన్నారు. కాగా, మంగళగిరిలో 193 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,618 కోట్ల వ్యయంతో మూడేళ్లలో ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
కాగా, మంగళగిరి ఎయిమ్స్కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెడదామని చంద్రబాబు అన్నారు. వాజ్పేయి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నానని చెప్పారు. మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇదే విషయంపై మాట్లాడారు. ఎయిమ్స్ కు ముందు మరో ఏ (అటల్) చేర్చాలనే అంశం తెరపైకి వచ్చిందని ఈ విషయాన్ని కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, అశోక్గజపతిరాజు, రాష్ట్రమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి హరిబాబు, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ కు రూ.4 కోట్ల విరాళం
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు శంకుస్థాపన చేసిన ఎయిమ్స్ నిర్మాణానికి పలువురి నుంచి భారీగా విరాళాలు వచ్చాయి. మొత్తం రూ.4 కోట్ల విరాళాలను దాతలు ప్రకటించారు. ఈ మొత్తంంలో డాక్టర్ కాసరనేని సదాశివరావు కుటుంబం నుంచి రూ.2 కోట్లు, డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు కుటుంబం నుంచి రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్టు వారు తెలిపారని సభలో కేంద్ర మంత్రి వెంకయ్య తెలిపారు.