జగన్ ఆస్తులు ఎందుకు జఫ్తు చేయట్లేదు, మా జోలికొస్తే.. ఖబడ్దార్!: మోడీకి బాబు తీవ్ర హెచ్చరిక
Recommended Video
విజయవాడ: మహానాడు ముగింపు సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై, వైసీపీ అధినేత వైయస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జగన్, పవన్, బీజేపీ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని, బీజేపీ కుట్రలో జగన్, పవన్ పావులుగా మారారని ఆరోపించారు. తాను ఎప్పుడూ సంయమనం కోల్పోలేదన్నారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు, ఆటలు ఇక్కడ సాగవని ఎన్డీయే నాయకులను హెచ్చరిస్తున్నానని చెప్పారు.
జూ.ఎన్టీఆర్.. మోత్కుపల్లి నోట లక్ష్మీపార్వతి మాట: బాబుకు అదే కోపం తెప్పించింది! వెనుక 3 అంశాలు
పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నప్పుడు, తనపై తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు కూడా నేను హుందాతనం కోల్పోలేదన్నారు. హైదరాబాదును ప్రపంచపటంలో పెట్టింది మేమే అన్నారు. అభివృద్ధి చెందిన గుజరాత్కు వేల కోట్లు తరలిస్తున్నారన్నారు. ఖబడ్దార్.. ఎవరైనా రాష్ట్రం జోలికి వస్తే వదిలేది లేదన్నారు. ఇటీవల కొందరు నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ ముఖ్యమన్నారు. ఏపీని ఆనంద ఏపీగా మార్చాలని కృషి చేస్తున్నామన్నారు.
తెలంగాణలో టీడీపీ బలంగానే ఉంది
యువత రాజకీయాల్లోకి రావాలని, టీడీపీకి మద్దతివ్వాలని చంద్రబాబు అన్నారు. కొందరు నేతలు ఎవరి దారి వారు చూసుకున్నా తెలంగాణలో టీడీపీ ఇప్పటికీ బలంగానే ఉందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీ కీలకపాత్ర పోషించనుందన్నారు. అందుకు తెలంగాణలోని కార్యకర్తలు, ప్రజలు, చిత్తశుద్ధితో పని చేసే నాయకులు అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పామన్నారు.
న్యాయం చేయమంటే కుట్రలు చేస్తారా?
మనం ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, వారు కనీసం ఆ ధర్మం పాటించలేదని, ఏపీకి ఏమీ సాయం చేయలేదన్నారు. నాడు విభజన సమయంలో టీడీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ విభజన చేస్తే రెండు రాజకీయ పార్టీలు సహకరించాయని, ఇప్పుడు మళ్లీ అదే జరుగుతోందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దాకా వదిలిపెట్టేది లేదని, అప్పటి దాకా వెంటపడతామని చంద్రబాబు అన్నారు. మేం చేసిన తప్పు ఏమిటన్నారు. న్యాయం చేయమంటే కుట్రలు చేస్తారా, మీ కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ కుదరవన్నారు. వాటిని మా తెలుగు తమ్ముళ్లు సమర్థవంతంగా తిప్పి కొడతారన్నారు.
ఖబడ్దార్.. మీ కుట్రలు ఇక్కడ కుదరవు, తిరుమల పేరుతో కుట్ర
70 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడతానని చంద్రబాబు అన్నారు. ఖబడ్దార్.. మీ ఆటలు, కుట్రలు ఇక్కడ కుదరవని, జాగ్రత్తగా ఉండాలని ఎన్డీయేకు హెచ్చరిస్తున్నానని చెప్పారు. నేను కార్యకర్తలకు, 5 కోట్ల ప్రజలకు భయపడతానన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ ఆదీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారని, ప్రజల ఆగ్రహంతో వెనక్కి తగ్గారన్నారు. ఎందుకు ఆదేశాలు ఇచ్చారని, ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. సమాధానం చెప్పే ధైర్యం ఉందా అన్నారు. వెంకటేశ్వర స్వామిని మీరు తీసుకుంటారా అని ప్రశ్నించారు. నగలకు సంబంధించిన అన్ని రికార్డులు ఉంటే నగలు పోయాయని చెబుతారని, డైమండ్ ఉంటే డైమండ్ పోయిందని చెబుతారని, తిరుమల పవిత్రతను కాపాడే హక్కు, బాధ్యత టీడీపీదేనని, ఆ హక్కు మీకు లేదన్నారు.
ఏటీఎంలు ఎందుకు పని చేయట్లేదో చెప్పు
నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టారని చంద్రబాబు అన్నారు. తనకు 50 రోజుల సమయం ఇవ్వాలని ప్రధాని మోడీ చెప్పారని, కానీ ఆ తర్వాత కూడా ఏటీఎంలు పని చేయలేదన్నారు. ఏటీఎంలు ఎందుకు పని చేయలేదో కేంద్రం సమాధానం చెప్పాలని మహానాడు వేదికగా అడుగుతున్నానని ప్రశ్నించారు. నీరవ్ మోడీ, బ్యాంకుల నాన్ ఫర్మార్మెన్స్, అవినీతికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దళితుల్లో, మైనార్టీల్లో, ఆదివాసీల్లో బీజేపీపై వ్యతిరేకత వచ్చిందన్నారు. టీడీపీ ఎప్పుడూ మతసామరస్యతను కాపాడుతోందన్నారు. ఎన్నికల సమయంలో అన్నీ మాయమాటలు చెప్పారన్నారు.
అవినీతిపరులను పక్కన పెట్టుకొని నీతులా?
వ్యవస్థలను తమ వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకొని దుర్వినియోగం చేశారని చంద్రబాబు అన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇన్ని తప్పులు చేసిన బీజేపీకి ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేస్తే ఓటేస్తారన్నారు. విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టి సమాజాన్ని కలుషితం చేస్తున్నారని, అవినీతిపరులను పక్కన పెట్టుకొని సమాజానికి తప్పుడు సంకేతాలిచ్చారన్నారు. టీడీపీ ఎప్పుడు అధికారం కోసం చూడలేదని, తనకు గతంలో రెండుసార్లు ప్రధాని పదవి అవకాశం వస్తే రాష్ట్రం కోసం వెళ్లలేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాదన్నారు. ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండి అవసరాలు తీర్చుతున్నారని చెప్పారు. బీజేపీ ఏపీలో గెలవదని, సీట్లు రావన్నారు. ఒక్క సీటు కూడా రాదన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పే వరకు ముందుకు సాగుదామన్నారు.
దారుణంగా ప్రవర్తించారు, అక్కడ గాలి, ఇక్కడ జగన్
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్నారని, ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. యువత నిరుద్యోగ యువతతో అభద్రతకు లోనవుతోందన్నారు. వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిందన్నారు. తమిళనాడు, కర్ణాటకలో దారుణంగా ప్రవర్తించారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని, కానీ అక్కడి పార్టీలు గుణపాఠం చెప్పాయన్నారు. గాలి జనార్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని కర్ణాటకలో, జగన్లు పక్కన పెట్టుకొని ఏపీలో రాజకీయం చేస్తున్న బీజేపీకి అవినీతి గురించి ఎలా మాట్లాడుతుందన్నారు. వారి ఆస్తులను ఎందుకు జఫ్తు చేయడం లేదని ప్రశ్నించారు. దోచుకున్న వారికి సహకరించే పరిస్థితి వస్తే ఎలా అన్నారు. ఆస్తులు జఫ్తు చేస్తే ఏపీకి ఎంతో ఉపయోగమన్నారు.