పవన్ నీకు థ్యాంక్స్, అప్పటి నుంచే టీడీపీ టార్గెట్, వల్గర్ మాటలు: హెరిటేజ్ టు లోకేష్పై బాబు కౌంటర్
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇటీవల జగన్, పవన్, బీజేపీ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.
Recommended Video
నేనెవరో అశోక్ గజపతిరాజు ఆ తర్వాతే మరిచారు: బాబు 40 ఏళ్ల అనుభవంపై పవన్ తీవ్రంగా
మనకు 70 లక్షల సైన్యం ఉందని, మనలను ఏ పార్టీ తట్టుకోలేదన్నారు. విభజన ద్వారా ఏపీకి అన్యాయం జరిగిందని, బీజేపీ న్యాయం చేస్తుందని భావించి ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నామన్నారు. విభజన సమయంలో రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని మనం చెప్పామని, కానీ హేతుబద్ధత లేని విభజనతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దెబ్బతిన్నదన్నారు. నాడు టీడీపీని దెబ్బతీయాలని చూసిన కాంగ్రెస్ దెబ్బతిన్నదన్నారు. టీడీపీని ఎవరూ ఏం చేయలేరన్నారు.
పవన్కు జవాబు.. నా భార్య కష్టం, నా కష్టం
జనసేనాని ఇటీవల పదేపదే హెరిటేజ్ ఇష్యూను లేవనెత్తుతున్నారు. దీంతో మహానాడులో చంద్రబాబు దీనిపై స్పందించారు. నా కేరక్టర్ వైపు వేలు చూపించి, నన్ను నిలదీసే దమ్ము ఎవరికైనా ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థ చిన్నగా ప్రారంభించి ఎదిగిందన్నారు. తన భార్య భువనేశ్వరి ఎంతో కష్టపడి ఆ సంస్థను పైకి తీసుకు వచ్చారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ప్రోత్సాహకాలు కూడా ఆ సంస్థకు లేవన్నారు. గత తొమ్మిదేళ్లుగా వ్యక్తిగత ఆస్తులు ప్రకటిస్తున్న ఏకైక నాయకుడిని తానే అన్నారు. నేను మామూలు కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు.
మచ్చ తేవొద్దని లోకేష్కు చెప్పానని చంద్రబాబు
లోకేష్పై పవన్ అవినీతి ఆరోపణలకు కూడా చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. బాబు మాట్లాడుతూ.. కొంతమంది అయితే తమ ఆస్తులు ఎక్కడున్నాయో, తమ కంపెనీలు ఎక్కడున్నాయో చెప్పుకోలేని పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లోకి రావాలని యువతకు తాను పిలుపునిచ్చానని చెప్పారు. తాను లోకేష్కు కూడా ఒకే మాట చెప్పానని, నీకు వ్యాపారం ఉంది చూసుకోవచ్చునని, రాజకీయాల్లోకి రావాలనుకుంటే మాత్రం ఎన్టీఆర్కు, తనకు మచ్చ తేకుండా పని చేయాలని చెప్పానని అన్నారు. నేను నీతి నిజాయితీగా ప్రజల కోసం బతుకుతున్నానన్నారు. తాను కుటుంబం కోసం బతుకడం లేదన్నారు.
చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడని జగన్పై బాబు ఆగ్రహం
ఎవరైనా తమ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదని, చదువు, సంస్కారం ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. తాను ఇదే పాటించానని చెప్పారు. నా నిరంతర శ్రమ, నేను నమ్ముకున్న సిద్ధాంతాల కారణంగా తెలుగు ప్రజలు తనను విశ్వసించారన్నారు. ఇటీవల కొందరు నాయకులకు, తనకు పోలిక ఉందా తమ్ముళ్లు అని ప్రశ్నించారు. వారు చాలా వల్గర్గా మాట్లాడుతున్నారని జగన్ను ఉద్దేశించి అన్నారు. బంగాళాఖాతంలో పారేయాలని, నడిరోడ్డుపై ఉరేయాలని అంటారని, చాలా వల్గర్గా మాట్లాడుతారన్నారు.
పవన్ నీకు థ్యాంక్స్ కానీ, అప్పటి నుంచే నీ విమర్శలు
ఏపీలో బీజేపీ వల్ల టీడీపీ గెలిచిందని ఇటీవల చెబుతున్నారని, కానీ అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మనం సత్తా చాటామని చంద్రబాబు చెప్పారు. బీజేపీతో పొత్తు వల్ల పది ఇరవై సీట్లు కోల్పోయామన్నారు. పవన్ కళ్యాణ్ కూడా పదేపదే నా వల్ల గెలిచారని చెబుతున్నారని, అది కరెక్ట్ కాదన్నారు. మీరు సహకరించారని, అందుకు థ్యాంక్స్ అని, కానీ మీ వల్లే గెలిచామనడం సరికాదన్నారు. మనలను టార్గెట్ చేసి పవన్ మాట్లాడుతున్నారన్నారు. మనం బీజేపీతో విభేదించాక పవన్ మనలను టార్గెట్ చేసుకున్నారన్నారు. కేంద్రం ఏం చెబితే ఆయన అలా ముందుకు సాగుతున్నారన్నారు.
అవినీతి అంటూ ఏకపక్ష విమర్శలు సరికాదు
ఎవరైనా అవినీతి అంటూ ఏకపక్ష విమర్శలు చేస్తే సరికాదని చంద్రబాబు అన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. ప్రత్యేక హోదా కోసం తనను నిలదీసే నాయకులు కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. ఓ నేతకు కేసుల భయం, మరో నేత కేంద్రంలో ఉన్న బీజేపీకి కీలుబొమ్మలా మారారన్నారు. మనం అక్వా కల్చర్కు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. 16 లక్షల కోట్ల ఎంవోయులు జరిగాయన్నారు. మనపై విమర్శలు రాకుండా చూసుకోవాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నాడు బ్రిటీష్ వారుకి సహకరించారు
కుట్ర రాజకీయాలను మనం ధీటుగా ఎదుర్కోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కొంతమంది బ్రిటిష్ వారితో కలిశారని, కానీ మహాత్మా గాంధీ పోరాడి స్వాతంత్రం సాధించారన్నారు. ఇప్పుడు కూడా కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేంద్రంతో లాలూచీపడి ఇప్పుడు మమ్మల్ని తిడతారా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు మనలను తిడుతుంటే చాలా బాధ వేస్తోందన్నారు. కేంద్రం సహకరించకపోయినా మనం నిలదొక్కుకున్నామన్నారు.