ఖబడ్దార్..వదలను, జగన్-పవన్ కళ్యాణ్లను ఓడించండి: బాబు, కాంగ్రెస్ తప్పుదిద్దుకుంటోందని వ్యాఖ్య
అమరావతి: రానున్న ఎన్నికల్లో ముస్లీం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తారని, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలను ఆ ఎన్నికల్లో ఓడించాలని ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన నారా హమారా, టీడీపీ హమారా పేరుతో జరిగిన మైనార్టీ సభలో పాల్గొన్నారు. ముస్లీం సంప్రదాయ దుస్తుల్లో సీఎం వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
కేంద్రంలో ఎన్డీయే ఓడిపోవాలంటే ఏపీలో పవన్ కళ్యాణ్ను, జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. విభజన సమయంలో కాంగ్రెస్ అన్యాయం చేసిందని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్తే మోసం చేశారన్నారు. దీంతో వారితో ఉండాల్సిన అవసరం లేదని ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు.
అవినీతి జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి బాండ్లపై అసూయతో విమర్శలు చేస్తున్నారన్నారు. తాము వైసీపీట్రాప్లో పడ్డామని ప్రధాని మోడీ చెబుతున్నారని, కానీ అవినీతి కుడితిలో పడింది బీజేపీనే అన్నారు. తమది యూటర్న్ కాదని, రైట్ టర్న్ అన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అన్నారు. వైసీపీ నేతలు జేబులు కొట్టేసే రకం అన్నారు. పీడీ అకౌంట్ల పేరిట బీజేపీ నేతలు డ్రామాలు ఆడారన్నారు.
ఎన్డీయేను ఓడించడం చారిత్రక అవసరం
ఏపీకి అన్యాయం చేశారంటూ పవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా చెప్పారని, రూ.75వేల కోట్లు రావాలని కూడా చెప్పారని, అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీకి వస్తే అండగా ఉంటానని చెప్పారని, కానీ ఆ తర్వాత కనిపించలేదన్నారు. బీజేపీతో కలిసిపోయారన్నారు. మోడీతో వైసీపీ కలిసిందా లేదా చెప్పాలని ప్రశ్నించారు. ఏపీకి అన్యాయంపై మోడీపై నిలదీయకుండా వెనుకేసుకొస్తున్నారని చెప్పారు. ఎన్డీయే ఓటమి చారిత్రక అవసరమని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని గద్దెదించాలన్నారు.
మీరు అధైర్యపడకండి, ఖబడ్దార్.. జాగ్రత్త
మైనార్టీలకు అండగా ఉంటామని, మీ హక్కులు కాపాడుతామని చంద్రబాబు చెప్పారు. మీరు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. మా మైనార్టీల జోలికి వస్తే ఖబడ్దార్.. జాగ్రత్త.. మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పారు. ఏం తినాలి, ఎలా బతకాలి అనే అంశాలతో మీకేం సంబంధమని ప్రశ్నించారు. దేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయని, అందరికీ స్వేచ్ఛ ఉండాలన్నారు. దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గోద్రా అల్లర్లను ప్రస్తావించారు.ఒకప్పుడు తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పే పరిస్థితికి వచ్చిందని చంద్రబాబు అన్నారు. తద్వారా కాంగ్రెస్ తప్పు సరిదిద్దుకుంటోందని అభిప్రాయపడ్డారు. హోదాపై కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ప్రతిపాదించా
అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా తాను ప్రతిపాదించానని చంద్రబాబు చెప్పారు. మైనార్టీ సోదరులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉందని దీని ద్వారా తెలియజేస్తున్నామన్నారు. పవన్, జగన్లకు మోడీ అంటే భయమని, తనకు అలాంటి భయం లేదన్నారు. బీజేపీ ఆటలు ఏపీలో సాగవని చెప్పారు. బీజేపీతో కలిసిన వైసీపీకి ఓటు వేయవద్దన్నారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వెళ్తుందన్నారు. పోరాటానికి మనమంతా సిద్ధంగా ఉన్నామన్నారు.
త్వరలో మైనార్టీ మంత్రి
మన జోలికి వస్తే ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండాలని, వదిలి పెట్టేది లేదని చంద్రబాబు అన్నారు. ముస్లీం మైనార్టీలకు తాను ఎంతో చేశానని చెప్పారు. మీ పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. విదేశీ విద్యకు డబ్బులు ఇస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మైనార్టీలు టీడీపీకే ఓటు వేస్తారని చెప్పారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రం తీరు సరిగా లేదన్నారు. పేద ముస్లీంలకు రంజాన్ తోఫా ఇచ్చామన్నారు. ముస్లీం మైనార్జీలు రాజకీయంగా ఎదగాలని, మీలో ఐకమత్యం రావాలని, మీరు లీడర్లుగా ఎదగాలని, మీకు ఎక్కువ సీట్లు ఇస్తానని చెప్పారు. నేను అవకాశమిస్తానని చెప్పారు. త్వరలో మైనార్టీ మంత్రిని నియమిస్తానని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పారు. తనకు కావాల్సింది మీ సహకారం, ఆశీస్సులు అన్నారు. అమరావతి బాండ్లపై గంటన్నరలో 2వేల కోట్ల బాండ్లు వచ్చాయని, దానికి మనపై నమ్మకమే కారణం అన్నారు. ప్రత్యేక హోదా మన హక్కు, అని అది కావాలన్నారు.