రూ.45 కోట్లు ఖర్చు చేసి, తెలంగాణకు అప్పగింత.: బాబు హంగామా కోసం రూ.100 కోట్లు?
విజయవాడ: ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్చంధంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తన బంగ్లాలకు మరమ్మతులు, హంగుల పేరిట ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టారని సాక్షి మండిపడింది.
ఉద్యోగులు పొదుపు పాటించాలని, ప్రజలు విరాళాలు ఇవ్వాలని చెప్పిన చంద్రబాబు మాత్రం తన సూక్తిని తానే పాటించలేదని విమర్శించింది. చంద్రబాబు బంగ్లాల కోసం ప్రభుత్వం చేసిన వ్యయం ఈ రెండున్నరేళ్లలో సెంచరీ దాటిందని విమర్శిస్తున్నారు.
ఈ రెండున్నరేళ్లలో ఒక్క కొత్త బంగ్లాను నిర్మించని చంద్రబాబు.. తన బంగ్లాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారని పేర్కొంది. హైదరాబాదులోని సచివాలయంలోని కార్యాలయాల్లో మరమ్మతులు, ఫర్నీచర్ కోసం రూ.45 కోట్లు వెచ్చించారు.
సచివాలయం, లేక్ వ్యూ అతిథి గృహానికి రూ. కోట్లు ఖర్చు పెట్టారని, హంగులు కల్పించారని, ఆ తర్వాత మకాం ఏపీకి మార్చేశారని విమర్శించింది. హైదరాబాదు సచివాలయంలోని ఎల్ బ్లాకులో రెండు అంతస్తుల్లో సీఎం కార్యాలయం కోసం రూ.10 కోట్లు వచ్చించారు. మరో రూ.10 కోట్లతో ఆధునాతన, అత్యంత విలాస డైనింగ్ టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, ఇతర ఫర్నీచర్ ఏర్పాటు చేశారని పేర్కొంది.
రూ.45 కోట్లతో హంగులు అద్దిన బంగ్లాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని పేర్కొంది.
మరోవైపు, ఉండవల్లిలో ముఖ్యమంత్రి ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కోసం రూ.40 కోట్లు వచ్చించారని, ఢిల్లీలో సీఎంకు కేటాయించిన ఇంటి మరమ్మతులకు రూ.5.82 కోట్లు ఖర్చు పెట్టారని పేర్కొంది. విజయవాడలో సాగునీటి శాఖకు చెందిన గెస్ట్ హౌస్ కోసం రూ.20 కోట్లు వెచ్చించారని పేర్కొంది.