కాపీపై టీడీపీ ఏమన్నదంటే? జగన్కు షాకిచ్చిన చంద్రబాబు, టీడీపీకి ఇవీ ప్లస్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు షాకిస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి ప్రకటించిన చంద్రబాబు, తాజాగా పింఛన్లను భారీగా పెంచి విపక్షాలను కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు.
వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు వీరందరికి పింఛన్లను రెట్టింపు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచి అమలు చేస్తారు. అంటే ఫిబ్రవరిలో ఈ పింఛన్లు అందుతాయి. కానీ తమ అధినేత జగన్ నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు కాపీ కొట్టారని వైసీపీ చెబుతోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. నెల్లూరు టీడీపీ నేత బీద మస్తాన్ రావు వైసీపీ నేతలు చేస్తున్న కాపీ ఆంశంపై స్పందించారు.
జగన్ లేదు.. పవన్ కళ్యాణ్ లేదు!: పార్టీ మారడంపై అఖిలప్రియ ఏమన్నారంటే?
కాపీ కొట్టాల్సిన స్థితిలో తమ పార్టీ లేదని టీడీపీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను కాపీ కొట్టాల్సిన స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదని బీద మస్తాన్ రావు చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికి అప్పుడు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోను ఇలాగే
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోను ఇలాగే జరిగింది. కాంగ్రెస్ పార్టీ పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. అదే సమయంలో కేసీఆర్ కూడా దానికి మరో రూ.16 జోడించి హామీ ఇచ్చారు. దీంతో తమ హామీలను టీఆర్ఎస్ కాపీ కొట్టిందని కాంగ్రెస్ నేతలు కూడా విమర్శించారు. కానీ అధికారంలో ఉన్న తెరాసనే తిరిగి గెలిచింది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇచ్చిన హామీలు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. సామాన్యులు టీడీపీ వైపు మొగ్గు చూపేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. కేసీఆర్ ఎన్నికల్లో గెలిచాక ఇస్తామని చెప్పారు, కానీ చంద్రబాబు ఎన్నికలకు మూడు నెలల ముందే, అనుకున్నదే తడవుగా ప్రారంభిస్తున్నారు. ఇది ఆ పార్టీకి ప్లస్ అని అంటున్నారు.
ఇవన్నీ టీడీపీకి బూస్ట్
ఎవరు ముందు ప్రకటన చేశారు, ఎవరు తర్వాత చేశారనేది సామాన్యులు చూడరని, ఇచ్చేది మాత్రమే చూస్తారని, కాబట్టి ఎన్నికలకు ముందు టీడీపీకి మంచి బూస్ట్ ఇచ్చే ప్రకటన చేశారని తెలుగు తమ్ముళ్లు సంబరపడి పోతున్నారట. యువతకు నిరుద్యోగ భృతి, నిరుపేద బ్రాహ్మణులకు ఉపాధి కోసం కార్లు.. ఇవన్నీ టీడీపీకి వచ్చే ఎన్నికల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవే అంటున్నారు.
ఒంటరి పోరుకు తోడు
అదే సమయంలో జనసేన ఒంటరిగా పోటీ చేసినా తమకు లాభమేనని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల తమకు లాభిస్తుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక చీలడం, పింఛన్లు, నిరుద్యోగ భృతిలతో పాటు ఇతర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల టీడీపీదే గెలుపు అంటున్నారు.