16ఏళ్ల తర్వాత ‘నంద్యాల’లో టీడీపీ సత్తా: జగన్పై బాబు పూర్తి ఆధిపత్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన సత్తా చాటారు. నంద్యాల ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలుపించుకుని ప్రజల్ల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన సత్తా చాటారు. నంద్యాల ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలుపించుకుని ప్రజల్లో తమ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
16ఏళ్ల తర్వాత సత్తా చాటిన టీడీపీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ తరపున పోటీ చేయించిన శిల్పా మోహన్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఏకంగా 27వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి ఇంత భారీ మెజార్టీ రావడం 16ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంవిశేషం.
తొలిసారి వచ్చి ఘన విజయం
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణం నంద్యాలకు ఉపఎన్నికలకు దారితీసింది. ఈ క్రమంలో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన భూమా బ్రహ్మానందరెడ్డి.. శిల్పామోహన్ రెడ్డిపై 27,466ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. కాగా, భూమా నాగిరెడ్డి సోదరుడు శేఖర్ రెడ్డి కుమారుడే ఈ బ్రహ్మానంద రెడ్డి.
టీడీపీలో కొత్త ఉత్సాహం
కాగా, 2014ఎన్నికల తర్వాత నంద్యాల ఎన్నికలను టీడీపీ, వైసీపీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, 2019 ఎన్నికలకు నంద్యాల ఎన్నికల ఫలితం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
టీడీపీ భయం తొలగిపోయింది..
బీజేపీతో మిత్రపక్షంగా ఉండటంతో ముస్లింల ఓట్లు పడతాయా?.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరకపోవడం లాంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపుతాయని అనుకున్నప్పటికీ.. టీడీపీ ఘన విజయం సాధించడం గమనార్హం.
చంద్రబాబుపై తరగని నమ్మకం..
నంద్యాల గెలుపునకు చంద్రబాబు నాయుడు ముందస్తు వ్యూహాలే కారణమని తెలుస్తోంది. నంద్యాలతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని నమ్మిన నంద్యాల ప్రజలు చంద్రబాబునాయుడికి మద్దతు పలుకుతూ టీడీపీ అభ్యర్థికే ఓటేశారు. నంద్యాల గ్రామీణ, పట్టణ ప్రజలతోపాటు గోస్పాడు మండల ప్రజలు కూడా టీడీపీకే భారీ ఎత్తున ఓట్లేయడం విశేషం.
13రోజులు జగన్ ప్రచారం చేసినా..
వైయస్ జగన్మోహన్ రెడ్డి 13రోజులపాటు విస్తృత ప్రచారం చేసినప్పటికీ నంద్యాల ప్రజల నమ్మకాన్ని చూరగొనలేదని వారి తీర్పుతో తేలిపోయింది. గతంలో రెండు సార్లు నంద్యాల నుంచి గెలుపొందిన శిల్పామోహన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపినప్పటికీ ప్రజలు ఆయనకు సానుకూలంగా స్పందించలేదు.
అనూహ్యంగా పుంజుకున్న టీడీపీ
అంతేగాక, 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నంద్యాలలో 47శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 40శాతానికి పడిపోవడం గమనార్హం. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ 45శాతం నుంచి అనూహ్యంగా 56శాతానికి పెంచుకోవడం గమనార్హం. కాగా, నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయంలో చంద్రబాబు ముందస్తు వ్యూహాలు, ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం, భూమా ఫ్యామిలీపై ఉన్న అభిమానం, సానుభూతి కలిసివచ్చిందని చెప్పవచ్చు.
పవన్ మద్దతు లేకున్నా..
నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారని ఆ పార్టీ వర్గాలు భావించినప్పటికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉండేందుకే నిర్ణయించుకున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఉపశమనం లభించింది. అయినప్పటికీ చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో నంద్యాలను టీడీపీ ఖాతాలో వేసుకున్నారు.