లిప్టులో ఇరుక్కుపోయిన బాబు: ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు లిప్టులో ఇరుక్కుపోయారు. దీంతో ఆయన భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిత్తురు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఆదివారం శ్రీకాళహస్తిలో వరద ప్రభావంపై చిత్తూరు జిల్లా అధికారులతో సమీక్షించాల్సి ఉంది. ఇందు కోసం ఆయన శ్రీకాళహస్తిలోని ఓ కళ్యాణ మండపంలోని నాలుగో అంతస్తుకు వెళ్లాల్సి ఉంది.
ఈ క్రమంలో చంద్రబాబు ఎక్కిన లిఫ్ట్ నాలుగో అంతస్తుకు అయితే వెళ్లింది కానీ, తలుపులే తెరచుకోలేదు. దాదాపు రెండు నిమిషాల పాటు భద్రతా సిబ్బంది యత్నించినా లిఫ్ట్ తలుపులు తెరచుకోలేదు.దీంతో ఆందోళనకు గురైన అధికారులు లిప్టుని కిందకు దించేశారు.
కిందకు వచ్చాక లిప్టు తలుపులు తెరుచుకున్నాయి. అనంతరం చంద్రబాబును బయటకు తీసుకొచ్చిన భద్రతా సిబ్బంది అక్కడే ఉన్న మరో లిప్టులో ఆయనను నాలుగో అంతస్తుకు తీసుకెళ్లారు. సమీక్ష అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలకు భరోసా ఉంటుందన్నారు.
ఏ విపత్తు వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలు భావించడం వల్లే తమపై ఒత్తిడి ఉంటుందని చెప్పారు. గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి పాలకులు పట్టించుకోకపోవడంతో కాకినాడలో బాధితులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
బాధితులకు ప్రభుత్వం కనీసం తిండి పెట్టలేని పరిస్థితిలో ఉంటే తాము ఆదుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి కలగకుండా బాధితులను ఆదుకున్నామని వివరించారు. నెల్లూరు జిల్లాలో నేతలు, యంత్రాంగం సక్రమంగా పని చేయడం లేదని మీడియా ప్రశ్నించగా ఏదైనా మంత్రం, లేదా టెక్నాలజీ ఉందేమో చెప్తే అమలు చేస్తామన్నారు.
మా వాళ్లు (టీడీపీ నాయకులు) కాంగ్రెస్ నేతలకన్నా బాగానే పనిచేస్తున్నారన్నారు. అందరూ నా మీద దృష్టి పెట్టి ఆశించడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇది ఇన్స్టంట్ కాఫీ కాదు. లీడరు అనే వారు గట్టిగా పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసినప్పుడు అధికారులను పరుగులెత్తించి నిజాయితీగా పనులు చేయించానన్నారు. ప్రస్తుతం పాలనాపరంగా పాత వాసనలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. వాటిని పారదోలి పారదర్శకంగా పాలన సాగించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు.
ఏపీని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కె.రామకృష్ణ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్లు సుబ్బారావు, సుధాకర్ పాల్గొన్నారు.