మోడీకి కక్ష నా మీదే కాదు, జగన్పై మీకు మమకారం పోవాలి!: కడపలో చంద్రబాబు
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఏపీలో కుట్రలు చేస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నిప్పులు చెరిగారు. కడప జిల్లాలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. నాడు (2014) నరేంద్ర మోడీ ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. మోడీ చేసింది నమ్మకద్రోహం కాదా అన్నారు. ఆ రోజు మనం ఎందుకు పొత్తు పెట్టుకున్నామో తెలుసా అన్నారు.
విషపదార్థాల్లేవు, తగ్గడానికి నెలన్నర పడుతుంది: డాక్టర్లు, ఐనా జగన్ పాదయాత్ర!
పార్లమెంటులో తెలుగు వారి ప్రయోజనాల కోసం పోరాడిన ఏకైక పార్టీ టీడీపీయే అన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటిని అమలు చేస్తామని మోడీ చేశారని, కానీ చేయలేదన్నారు. మోడీ చేసింది ముమ్మాటికి నమ్మకద్రోహం అన్నారు. మోడీ హామీలు నమ్మి ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. నేను మీ కోసం (ప్రజలు) పోరాడుతుంటే వైసీపీ ట్రాప్లో పడ్డట్లు బీజేపీ మాట్లాడుతోందన్నారు. ఇది న్యాయమా అన్నారు. జగన్.. జగన్ మోడీ రెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు.
మోడీకి నా మీద కక్ష కాదు
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావాలని అడిగానని, అది తప్పా అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోడీ చెప్పారన్నారు. మన రాష్ట్రంపై ఐటీ దాడులు జరిగాయన్నారు. మోడీతో నేను మంచిగా ఉన్నంత వరకు, ఎన్డీయేలో ఉన్నంత వరకు దాడులు లేవని, ఇప్పుడు నిలదీస్తుంటే ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. విభజన చట్టం అమలు చేయమంటే కోపం, కక్ష పెంచుకున్నారన్నారు. ఇది నా మీద కక్ష కాదని, ఏపీ పైన అన్నారు.
మోడీ కంటే ముందే సీఎంను అయ్యా
తాను ప్రధాని మోడీ కంటే ముందే సీఎంను అయ్యానని, మోడీ 2001లో సీఎం అయితే తాను 1995లో అయ్యానని చంద్రబాబు చెప్పారు. న్యాయం కోసం పోరాడే పార్టీ టీడీపీ అన్నారు. మోడీ మనల్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని, కానీ మీ వల్ల కాదన్నారు. అవినీతి పార్టీ వైసీపీ వల్ల కూడా తమను నిర్వీర్యం చేయడం కాదన్నారు. కుట్ర, కుతంత్రాలు న్యాయాన్ని, ధర్మాన్ని భూస్థాపితం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ ఆ కుట్రలు కుదరవన్నారు.
మేం ఈ దేశ పౌరులమే
విశాఖపట్నంలో ఇండియా - వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కుట్ర రాజకీయాలు చేశారని చంద్రబాబు అన్నారు. అవినీతిపరులను మోడీ ఏం చేయలేరన్నారు. కానీ ఎదురు తిరిగిన నాయకులను బెదిరిస్తున్నారన్నారు. వారిపై లేనిపోని దాడులు చేస్తున్నారని, హింసించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి ఆస్తులపై ఐటీ సోదాలు జరిగాయన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం బీటెక్ రవి, సీఎం రమేష్ దీక్ష కూడా చేశారన్నారు. రాయలసీమలో ఇక్కడే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నానని అన్నారు. తనకు రాజకీయాలు అవసరం లేదని, ఎన్డీయే ముందుకు వస్తే ఉక్కు పరిశ్రమకు సహకరిస్తామన్నారు. మీరు ఇవ్వకుంటే ఎలా రప్పించుకోవాలో మాకు తెలుసునని చెప్పారు. మేం ఈ దేశ పౌరులమేనని చెప్పారు.
జగన్పై మీకు మమకారం పోవాలి
ఇక్కడ ఓ నాయకుడు ఉన్నాడని, ఆ నాయకుడు ఎప్పుడైనా కడప జిల్లా ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడారా, కేంద్రాన్ని నిలదీశారా అని జగన్ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. మీకు (కడప జిల్లా ప్రజలకు) ఇంకా కొంత మమకారం ఉందని అతనిపై అది పోవాలి, న్యాయం కోసం పోరాడుతున్న నాకు అండగా ఉండాలన్నారు. మన పైన మాటల దాడి చేస్తున్నారన్నారు. తెలుగు జాతిపై కేంద్రం కక్ష పెంచుకుందన్నారు. అందుకే ఐటీ దాడులు చేసి, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తోందన్నారు.
అప్పుడు నా ఎమ్మెల్యేలను వైయస్ తీసుకున్నారు
నేను ఎన్డీయేలో ఉన్నప్పుడు బీజేపీలో ఉండవద్దని, రాష్ట్రం కోసం బయటకు రావాలని పదేపదే అన్న వ్యక్తులు ఇప్పుడు నేను పోరాడుతుంటే ఎక్కడ ఉన్నారని పవన్ కళ్యాణ్, జగన్లను ఉద్దేశించి అన్నారు. పవన్ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. తుని నుంచి ఇప్పటి వరకు విపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. అసెంబ్లీకి రావడం లేదన్నారు. తనను అవమానించారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలను నాడు వైయస్ తీసుకున్నారని, కానీ అప్పుడు తాను వీరోచితంగా పోరాడానని చెప్పారు. మా ఎమ్మెల్యేలను చంపినా ప్రజాస్వామ్యం కోసం పోరాడామన్నారు.