ఒడిసా తరహాలో ఒకే పార్టీ ఉండాలి: ఏపీలో వైసీపీని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఫిరాయింపులే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్లు సమాచారం. ఆదివారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) సమావేశానికి ఏపీ, తెలంగాణలకు చెందిన టీడీపీ ఎంపీలతోపాటు ఏపీ బీజేపీ ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజులు హాజరయ్యారు.
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులతోపాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. ఈ సమావేశాల్లో కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని టీడీపీ నిర్ణయించింది. అదే విధంగా కేంద్రం సహకారంతోనే నిధులను సాధించుకుందామని అభిప్రాయపడింది.
కాగా రైల్వేబడ్జెట్లో ఏపీకి చేసిన కేటాయింపులపట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత బడ్జెట్లో కేటాయింపులకంటే ఈసారి మెరుగుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నానికి రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరినా బడ్జెట్లో దాని ప్రస్తావన రాకపోవడంపై కారణాలేమిటో తెలియదని, అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండని చంద్రబాబు వారికి సూచించారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై కూడా కాస్తంత వేచి చూసే ధోరణిని అవలంభిద్దామని చెప్పినట్లు సమాచారం. బడ్జెట్లో ఏపీకి నిధులు ఆశించిన మేరకు రాకపోతే ప్రధాని, ఆర్థికమంత్రి, నీతిఆయోగ్ దృష్టికి లేఖరూపంలో తెలియచేద్దామన్నారు. కరువు, వరదలవల్ల రాష్ట్రానికి నష్టం జరిగినా కేంద్రంనుంచి ఆశించినంతగా నిధుల కేటాయింపు లేదని ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అది నిజమేనని అంగీకరించిన చంద్రబాబు దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వారిని కోరారు. ఇసుక విధానంపై కూడా ఎంపీలు చంద్రబాబుతో మాట్లాడినట్లు తెలిసింది. ఉచితం పేరుతో పార్టీ నేతలు, ఇతరులు భారీగా ఇసుకను నిల్వచేసి ఇతర రాష్ట్రాలకు తరలించి, రాష్ట్రంలో ఎక్కువ ధరలకు అమ్మితే మరింత చెడ్డపేరు వస్తుందని చెప్పారు.
మరోవైపు ఈ సమావేశంలో ఫిరాయింపులపై కూడా చర్చించారు. ఏపీలో వలసలే లక్ష్యంగా పనిచేయడంతోపాటు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎంపీలకు ఈ సందర్భంగా చంద్రబాబు హితబోధ చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే బలమైన పార్టీగా ఉండాలంటే ఫిరాయింపులను ప్రోత్సహించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ప్రతిపక్షాల్ని బలహీనపర్చడంలో అధికారపార్టీలు విజయవంతమయ్యాయని, అందువల్లే అక్కడ ఒకే పార్టీ దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతుందని, ఇక్కడా ఆ పరిస్థితి రావాలంటే ఫిరాయింపులద్వారా పార్టీని బలపర్చుకోవడమే ఏకైక మార్గమని ఎంపీలకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది.
'ఒడిసా తరహాలో రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా కనీసం మరో పదేళ్లు మనమే అధికారంలో ఉండాలి. అందుకు తగ్గట్టుగా పార్టీని బలోపేతం చేయాలి' అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీపీ సమావేశంలో ఆయన పార్టీ బలోపేతంపై ఎంపీలతో మాట్లాడారు. అభివృద్ధి చూసే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారన్నారు.
'మీమీ నియోజకవర్గాల్లో చేరికలను అడ్డుకోవద్దు' అని ఎంపీలకు సీఎం సూచించారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదని ఒక దశలో సీఎం వ్యాఖ్యానించారు. 'ఒడిసా తరహాలో ఒకే పార్టీ ఉండాలి. నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగుసార్లు గెలిచారు. అక్కడ నవీన్ను సవాలు చేసే ప్రతిపక్షమే లేదు. మనం కూడా పార్టీని ఆ విధంగా తీర్చిదిద్దాలి.
బిహార్, చత్తీస్గఢ్లోనూ అక్కడి సీఎంలు వరుసగా గెలిచారు' అని సీఎం పేర్కొన్నారు. ప్రజలతో ఉన్నంతకాలం మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అయితే ఫిరాయింపులపై నేతలమధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం.
ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.