రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, ఇక చెప్పేయండి: మోడీ-జగన్లకు బాబు ఆఫర్!
అమరావతి: ఢిల్లీలో భేటీతో వైయస్సార్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. పీఏసీ చైర్మన్గా ఉండి కోవర్టుగా ఎలా వ్యవహరిస్తారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కలకలం: 'తేలిపోయింది.. వీడియోలే నిదర్శనం, పురంధేశ్వరి సహా అమిత్ షాతో బుగ్గన భేటీ వెనుక?'
రెండు పార్టీల (వైసీపీ, బీజేపీ) బంధాన్ని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్న ఎమ్మెల్యేలు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్ ఢిల్లీకి వెళ్లి నివేదికలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను కూడా కేంద్రం తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు.
ఏదో చేస్తామని అంటున్నారు, 45 ఏళ్లకు పింఛన్ అంటే
ఇప్పుడు రాష్ట్రంలో కొందరు నేతలు ఏదో చేస్తామని అంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 45 ఏళ్ళకే పింఛన్ ఇస్తామని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. 45 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలంటే రూ.20 వేల కోట్లు కావాలన్నారు. సచివాలయం, శాఖలు తెలియని వాళ్లు ఏదో చెబుతున్నారన్నారు. ఓ వైపు కడపలో స్టీల్ ప్లాంట్ లేదని కేంద్రం చెబుతుంటే, బీజేపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యేలు బేటీ అవుతున్నారన్నారు.
ఇక మేం కలిశామని చెప్పేయండి
మేం కలిసిపోయామని వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలు నేరుగా చెప్పవచ్చునని, దాచుకునేది లేదని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. సొంత జిల్లాలో ప్లాంట్ రాకుంటే బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుతారా అని నిలదీశారు. నల్లధనం బయటకు తెచ్చి అందరి అకౌంట్లలో డబ్బులు వేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారన్నారు. నల్లధనం విషయంలో మోడీ ఎన్నో చెప్పారన్నారు.
ప్రతి నిమిషం అమూల్యం
అంతకుముందు, పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచనలు చేశారు. ఎంపీలు అన్ని జిల్లాల్లో వారానికో కార్యక్రమం చేపట్టాలన్నారు. పొత్తుతో సాధించలేనిది, పోరాటంతో సాధించాలని పిలుపునిచ్చారు. పోరాటంలో ప్రతి నిమిషం అమూల్యమన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమరపాటు తగదన్నారు.
ముందు కడప స్టీల్ ప్లాంట్, ఆ తర్వాత రైల్వే జోన్
కడప స్టీల్ ప్లాంట్ కోసం రాజ్యసభ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ చేపట్టే దీక్షను విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. ఎంపీలంతా కడప వెళ్లి సంఘీభావం తెలపాలని సూచించారు. కడప తర్వాత విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ఉద్ధృతం చేయాలన్నారు.
అమరావతికి నిధుల కోసం ఒత్తిడి తేవాలి
వైసీపీ, బీజేపీ నేతలవి కుట్ర రాజకీయాలు కాక మరేమంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదేనా రాష్ట్ర ప్రయోజనాలపై వారికి ఉన్న చిత్తశుద్ధి అన్నారు. రాజధానికి నిధులు విడుదలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కుట్ర రాజకీయాలు ఎదుర్కోవడం టీడీపీకి కొత్త కాదన్నారు.