అవిశ్వాసం ఇలా ఉండొచ్చు, 2 బృందాలతో సమాచారమిస్తా, నిలదీయండి: ఎంపీలతో బాబు
అమరావతి: టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీలు అవిశ్వాస తీర్మానంకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రేపో, ఎల్లుండో దీనిపై చర్చ జరగనుంది. ఎవరి నోటీసును కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందనేది మంగళవారం తేలనుంది. బుధవారం చర్చకు అవకాశముందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్కు 2+2 భద్రత, ఇక సమయం చూసి 'ఆమరణ'పై అడుగు
అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన బలం ఉండటం, ఏపీకి ఇచ్చిన వాటిపై తేల్చేందుకు కేంద్రం కూడా సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం టీడీపీ ఎంపీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి కీలక సూచనలు చేశారు.
అవిశ్వాస తీర్మానం ఇలా చేపట్టవచ్చు
అవిశ్వాస తీర్మానంపై అనేక పార్టీలు నోటీసులు ఇచ్చాయని చంద్రబాబు అన్నారు. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎంలు ఇచ్చాయని చెప్పారు. లాటరీ ద్వారా అవిశ్వాస తీర్మానం చేపట్టే అవకాశముందని చెప్పారు. లేదా ముందు నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసాన్ని చేపట్టవచ్చునని చెప్పారు.
వీటిపై నిలదీయండి
అవిశ్వాస తీర్మానంపై చర్చను సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జాతీయస్థాయిలో వినిపించాలన్నారు. నాలుగేళ్లయినా చట్టంలో 19 అంశాలు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించాలన్నారు. పార్లమెంటు ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చక పోవడాన్ని నిలదీయాలన్నారు.
సమాచారం మొత్తం అందుబాటులో ఉంచుతాం
అవిశ్వాసంపై చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనదని చంద్రబాబు అన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభా వేదికగా 5 కోట్ల మంది ఏపీ ప్రజల ఆకాంక్షలు ప్రతిధ్వనించాలన్నారు. ఎంపీలకు అందుబాటులో కావాల్సిన సమాచారాన్ని మొత్తం ఉంచుతామని చెప్పారు.
ఢిల్లీలో ఓ బృందం, అమరావతిలో ఓ బృందం
అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే ఎంపీలకు పూర్తి సమాచారం అందించేందుకు రెండు బృందాలను అందుబాటులో ఉంచుతామని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో ఒక బృందం, అమరావతిలో మరో బృందం పని చేస్తుందన్నారు. అన్ని పార్టీలను కలిసి ఏపీకి సహకరించాలని కోరారని చెప్పారు. మనవద్ద ఉన్న సమాచారన్ని మొత్తం వారికి ఇవ్వాలన్నారు.
టీఆర్ఎస్ ముందుకు వచ్చింది
ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవడం సబబేనా అని ప్రశ్నించాలని చంద్రబాబు అన్నారు. మనకు జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయిగా మార్చామని చెప్పారు. ఎంపీలు రాత్రికి రాత్రే ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ మనకు సహకరించేందుకు ముందుకు వచ్చిందన్నారు.
ఇది ఏపీ సమస్య మాత్రమే కాదు
మన సమస్య కేవలం రాష్ట్రానికే పరిమితమైన సమస్య కాదని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఒంటరిని చేయాలనే బీజేపీ ప్రయత్నాలు తిప్పికొట్టాలన్నారు. పసుపు చొక్కాలు, కండువాలతో పార్లమెంటుకు వెళ్లాలని సూచించారు. అన్నింటికి యూసీలు ఇచ్చాం కాబట్టే ఆ తర్వాత విడతలుగా నిధులు ఇచ్చారన్నారు.