సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై చంద్రబాబు ఆగ్రహం: ఏమన్నారంటే..?
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు అనంతరం మాట్లాడారు. నేరచరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి నేరాలే లేకుండా చేస్తామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
తన నేరారోపణలపై శుక్రవారం కోర్టు హాజరుకాకుండా మినహాయింపులు కోరుతున్న వ్యక్తి నోట నీతి వ్యాఖ్యలు వినాల్సి వస్తోందని అన్నారు. బుధవారం ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేపడితే సీఎం కనీసం స్పదించరా? అంటూ మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేస్తామని గానీ, నిందితులపై చర్యలు తీసుకుంటామని గానీ.. ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటూ ఒకరున్నారా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి లాంటి ప్రధాన అంశాలపై కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ స్పందించకపోవడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
12గంటలపాటు నిర్బంధం: చంద్రబాబుకు పోలీసుల నోటీసులు, లాడెన్తో పోలికపై లోకేష్ ఫైర్
ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రులకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా.. ఆ గొడవలను వారి జిల్లాలకే పరిమితం చేసేవారని.. కానీ, ఇప్పుడు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.