జగన్ గొప్ప నేతా?: ఇదేంటి మోడీ?, ఇక బీజేపీ-వైసీపీ పోటీ!: కర్ణాటక ఓటర్లకు బాబు పిలుపు
అమరావతి: కేంద్రంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కేంద్రం, వైసీపీ కలిసి రాష్ట్రంపై ఎన్నో కుట్రలు పన్నాయని, వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు చెప్పారు.
'వస్తున్నా మీకోసం' పాదయాత్రకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సచివాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేశామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలిపారు.
అందుకే పాదయాత్ర చేశా
అనంతపురం జిల్లా హిందూపురంలో అక్టోబర్ 2న పాదయాత్ర ప్రారంభించి విశాఖలో ముగించామని చంద్రబాబు చెప్పారు. పవిత్ర భావంతో పాదయాత్ర చేశానన్నారు. పాదయాత్ర చేపట్టకముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కాంగ్రెస్ పాలనలో నిరంతర విద్యుత్ కోతలు ఉండేవని, ఎక్కడ చూసినా భూ కబ్జాలే ఉండేవని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అరాచక శక్తులు చేరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాయని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను చూసిన తర్వాతే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వాస్తవాలను వెల్లడించి ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేశానని చంద్రబాబు చెప్పారు.
హామీలన్నీ నెరవేర్చాం
పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు అమలు చేశామని సీఎం వివరించారు. కాంగ్రెస్ హయాంలో వృద్ధులకు కేవలం రూ.200 మాత్రమే పింఛను ఇచ్చేవారని, తాము రాష్ట్రంలో 47 లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేదని, నిరంతర విద్యుత్ కోతలు ఉండేవని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లో విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచామని, డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశామని, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పారు. పట్టిసీమను పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాకు తీసుకొచ్చామని తెలిపారు.
కోర్టులకు వెళ్లేవారు విమర్శలా?
విభజన గాయాలు ఎన్ని ఉన్నా సొంత కష్టంతో నాలుగేళ్లుగా ఎదుగుతూ వచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజలకు ఎక్కడా ఇబ్బందిలేని పాలన ఇచ్చామని తెలిపారు. కేంద్రం సహకరించి ఉంటే అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్లేవాళ్లమని వివరించారు. బీసీలకు అన్యాయం చేశామంటూ కొందరు మాట్లాడుతున్నారని, అసలు వైయస్ హయాంలో బీసీలకు కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని అన్నారు. వారికి కనీసం రుణాలు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే నిందితులు కూడా తనపై మాట్లడడం విడ్డూరంగా ఉందని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవాచేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ కలిసి పోటీ చేసినా..
కేంద్రం చాలా నాటకాలు ఆడిందని, బీజేపీ, వైసీపీలు కలిసి ఏపీపై కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం, ప్రత్యేక హోదాపై కుట్రలు చేస్తున్నారని, విశాఖ-చెన్నై కారిడార్కు కేంద్రం సహకరించడం లేదని కేంద్రంపై మండిపడ్డారు. మొన్నటి వరకు రహస్యంగా ఉన్న బీజేపీ, వైసీపీల రహస్య ఏజెండా ఇప్పుడు బహిర్గతమైందని అన్నారు. వైసీపీని చూసుకునే టీడీపీని దూరం పెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్య లేదన్నారు.
ఏ1, ఏ2లకు మోడీ అపాయింట్మెంట్లా?
ఏడాదిలోగా నల్లధనం తెస్తామన్న ప్రధాని మోడీ హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేస్తామంటూ ఏ1, ఏ2 నిందితులైన జగన్, విజయసాయిలకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం ఏంటని నిలదీశారు.
తాను మొదట్నుంచి గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నానని చంద్రబాబు అన్నారు. రామ్లాల్ గవర్నర్గా ఉన్న సమయంలో పూర్తి మెజార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేశారని అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పథకాలను, కార్యక్రమాలను మెచ్చుకుని.. రిటైరయ్యాక తప్పుపడుతూ పుస్తకాలు రాస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
కర్ణాటక తెలుగు ఓటర్లు గుణపాఠం చెప్పాలి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని పరోక్షంగా ఆ రాష్ట్రంలోని తెలుగువాళ్లకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఏపీకి అన్యాయం చేసిన వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, వారికి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు అవినీతి పరులు విదేశాలకు పారిపోయినా కూడా పట్టుకోలేని పరిస్థితి ఎన్డీఏ పాలనలో ఉందని ముఖ్యమంత్రి విమర్శించారు. తెలుగు దేశం పార్టీ ఏది చేసినా ఓ పద్ధతి ప్రకారం చేసిందని అన్నారు. 2050 కల్లా ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యం పెట్టుకున్నామని, ఆ విధంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఇంకా బాగా ముందుకు వెళ్లే వాళ్లమని వ్యాఖ్యానించారు.
జగన్ గొప్ప నేతా?
ఓ పార్టీ అధినేత తెలుగువారికి అపకీర్తి తీసుకొచ్చారని చంద్రబాబు నాయుడు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జగన్ కంటే మించిన నాయకుడు లేడని, గొప్ప నాయకుడని ఓ కేంద్ర మంత్రి అన్నారని, ఎన్డీఏ.. గౌరవం, పద్ధతి లేని రాజకీయాలు చేస్తూ పొత్తులు పెట్టుకుంటుందని విమర్శించారు. అవినీతిపరులతో పొత్తు పెట్టుకున్న తరువాత ఎన్డీఏని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా బలమైన పార్టీ అని, ఆ పార్టీ ఎన్డీఏలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యానించారు.