పవన్ అడ్డదారిలో వెళ్తూ, జగన్ తోకముడిచాడు, నన్ను పలకరించకున్నా: బాబు ఆవేదన
అనంతపురం: విభజనతో నష్టపోయిన ఏపీ ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాలలో తాను తగ్గానని, కేంద్రంలో పెద్దలు సరిగా స్పందించకపోయినా, తనను ఏమాత్రం పలకరించకపోయినా నవ్యాంధ్ర కోసం అనేక ప్రయత్నాలు చేశానని చంద్రబాబు అన్నారు. పోరాటం అనేది వస్తే ఎవరైనా తన తర్వాతే అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కాపు దెబ్బ: ఇదీ విషయం... వైసీపీ ట్విస్ట్, జగన్ వ్యూహంపై టీడీపీ అప్రమత్తం
అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానని, జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చి తీరుతుందన్నారు. జిల్లాలో లక్షా ఏడు వేల ఇళ్లు ఇచ్చామన్నారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు తరలించే కాల్వకు పరిటాల రవీంద్ర కాల్వగా పేరు పెడతామని, నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని అన్నారు. బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నరేంద్ర మోడీ అలా అన్నారు
నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పడ్డానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ వారే పడ్డారన్నారు. తనకు పరిపక్వత లేదని ప్రధాని విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిందన్నారు. బీజేపీ నమ్మకద్రోహంపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు.
పవన్ కళ్యాణ్పై చంద్రబాబు ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీకి వచ్చి ఇతర ఎంపీల మద్దతు కూడగడతానని కూడా చెప్పారని తెలిపారు. కానీ ఏదీ చేయలేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో తమది యూటర్న్ కాదని, రైట్ టర్న్ అన్నారు. మీరు అడ్డదారుల్లో వెళ్తూ నన్ను విమర్శిస్తారా అన్నారు.
కొందరు జైలుకెళ్తామని ఊడిగం చేస్తున్నారు
కొందరు జైలుకు వెళ్తామనే భయంతో ఢిల్లీకి ఊడిగం చేస్తున్నారని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. కేంద్రంతో విరోధం పెట్టుకుంటే జైల్లో ఉండాల్సి వస్తుందని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ట్రాప్లో పడింది బీజేపీయే అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి కుట్ర రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. బీజేపీ కుట్రలు గుర్తించిన వెంటనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. మీరు వారికి నాలుగు ఓట్లు వేస్తే కేసుల మాఫీ కోసమే వినియోగిస్తారని జగన్ను ఉద్దేశించి అన్నారు. 50 శాతం దాటితే కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని జగన్ అన్నారని, అందరూ వ్యతిరేకించడంతో తోక ముడిచారన్నారు.
వైసీపీ నేత ఆస్తుల జఫ్తుపై ప్రశ్న
అవినీతి పార్టీని నమ్ముకుని బీజేపీ నేతలు నీతులు మాట్లాడుతున్నారని, అవినీతిని ప్రక్షాళన చేస్తానని ఎన్నికల సమయంలో మోడీ హామీ ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారని, వైసీపీ కేసులు ప్రధానికి కనబడలేదా అన్నారు. ఏ1, ఏ2ను పీఎంవో ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నారన్నారు. ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని కేంద్రమంత్రి రాజ్నాథ్ రాజ్యసభలో ప్రకటించారని, సుప్రీంలో వేసిన అఫిడవిట్లో రైల్వే జోన్ ఇవ్వలేమన్నారన్నారు. విభజన హామీలపై జనసేన, వైసీపీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. హోదాతోపాటు అన్ని డిమాండ్లు సాధిస్తామని చెప్పారు. నేను ఎవరికీ భయపడనని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.