ఢిల్లీ మెట్రోలో చంద్రబాబు: స్వయంగా ట్వీట్ చేసిన ఏపీ సీఎం
న్యూఢిల్లీ: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. సిస్కో (కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంపెనీ) కంపెనీ ప్రతినిధులతో చర్చల కోసం ఢిల్లీకి వెళ్లిన ఆయన, ఆ భేటీ ముగిసిన తర్వాత అక్కడి నుంచి ముంబైకి వెళ్లారు.
ఢిల్లీలో భేటీ ముగిసిన అనంతరం విమానాశ్రయానికి వెళ్లేందుకు గాను చంద్రబాబు ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా మెట్రో రైల్లో తాను ప్రయాణిస్తున్న ఫొటోను ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘ఢిల్లీ మెట్రో సామర్ధ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా' అంటూ ఆ ఫొటోకు ఆయన కామెంట్ను జత చేసి పోస్టు చేశారు.
On a metro ride with Union Minister Ashok Gajapathi Raju in Delhi. Experiencing its efficiency. pic.twitter.com/qJXMOCM6QY
— N Chandrababu Naidu (@ncbn) February 16, 2016
సిస్కో ఛైర్మన్తో జరిగిన సమావేశంలో నవ్యాంధ్ర వాణిజ్య పట్టణం విశాఖపట్నంలో సిస్కో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు. దీనికి స్పందించిన సిస్కో ఛైర్మన్ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ భేటీ అనంతరం ఆనంద్ మహేంద్ర సహా పలువురు పారిశ్రామిక వేత్తలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముంబైకి వెళ్లి, అక్కడ జరుగుతున్న మేకిన్ ఇండియా వారోత్సవాల్లో చంద్రబాబు పాల్గొన్నారు.