టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాబు: కేంద్ర, రాష్ట్ర కమిటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం పూర్తి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కేంద్రకమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఎల్.రమణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ప్రమాణస్వీకారం చేయించారు.
టీడీపీ ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనుముల రేవంత్ రెడ్డిలతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ నియమితులైన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షులతో పాటు కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.
అలాగే పలువురు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా నియమితులవగా వారందరి చేత పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. వీరందరూ రెండేళ్ళపాటు పార్టీ పదవుల్లో కొనసాగనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం జంట నగరాలు పసుపు జెండాలతో రెపరెపలాడుతున్నాయి.
ఈ ఉదయం టీడీపీ జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీలు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను స్వాగత తోరణాలు, ప్లెక్సీలు, తెలుగుదేశం జెండాలతో అలంకరించారు. శనివారం రాత్రి నగరంలో వర్షం పడినప్పటికీ, తెలుగు తమ్ముళ్లు నగరాన్ని పసుపుమయం చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి బంజారాహిల్స్ లోని టీడీపీ కార్యాలయం వరకూ రోడ్ల వెంబడి చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ చిత్రాలతో పాటు ముఖ్య నేతలు, ప్రమాణ స్వీకారం చేస్తున్న నేతల చిత్రాలున్న ప్లెక్సీలు అందంగా అలంకరించారు.