కేసీఆర్! నిజమే, హైదరాబాద్ నేను కట్టలేదు, జగన్-పవన్ కళ్యాణ్ మద్దతిస్తారా?: చంద్రబాబు
విజయవాడ: పవన్ కళ్యాణ్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు మద్దతివ్వడం సరికాదని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయనగరంలోని ధర్మపోరాట దీక్షలో అన్నారు. కేంద్రం ఏపీకి సహకరించనందునే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్ నగరంపై కేసీఆర్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవాలి, పవన్ కళ్యాణ్ కూడా మద్దతిచ్చారు: చంద్రబాబు
ధర్మపోరాటం ద్వారా ప్రజలను సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. న్యాయం, ధర్మం కోసం తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఆఖరుకు చివరి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండి చేయి చూపారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ కోసం కేంద్రం నుంచి బయటకు వచ్చామని చంద్రబాబు చెప్పారు.
బెదిరింపులతో రాజకీయం చేస్తారా?
బెదిరింపులతో రాజకీయం చేస్తే న్యాయం అవుతుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. మన ఎంపీలను బెదిరించారని, సీబీఐ, ఈడీ దాడులు చేయించారని ఆరోపించారు. ఈడీ వంటి దాడులకు భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. మనకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఢిల్లీ కన్నా అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని చెప్పి, కేవలం రూ.1500 కోట్లు ఇచ్చారని చెప్పారు.
అవిశ్వాసం ఓ చరిత్ర
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. రూ.45వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేపట్టామని అన్నారు. రైల్వే జోన్ గురించి మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ఇచ్చిన ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదని ఆరోపించారు. పార్లమెంటులో మన ఎంపీల పోరాటం అభినందనీయమని చెప్పారు. రాష్ట్రం కోసం మనం ఎంపీలు చాలా గట్టిగా పోరాడారని చెప్పారు. ఓ రాష్ట్ర సమస్య మీద అన్ని పార్టీలు అవిశ్వాసం పెట్టడం ఓ చరిత్ర అన్నారు.
కేసీఆర్! హైదరాబాద్ నేను కట్టలేదు
ఈ సందర్భంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నేనే కట్టానని చంద్రబాబు అంటుంటారని, అలా అయితే కులీకుతుబ్ షా ఉరి వేసుకోవాలా అని కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో అంటున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. హైదరాబాదును నేను కట్టలేదని, నిజాం కట్టారని, కానీ సైబరాబాద్ నగరాన్ని నేనే కట్టానని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ప్రపంచమంతా కాలి నడకన తిరిగి హైదరాబాదును అభివృద్ధి చేశానని చెప్పారు.
పవన్, జగన్లు మద్దతిస్తారా?
ఐటీ కంపెనీలు, శంషాబాద్ విమానాశ్రయాన్ని తాను ఏర్పాటు చేశానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు నేనే శ్రీకారం చుట్టానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కేసీఆర్కు మద్దతివ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తెరాస చేసిందేమీ లేదని చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ చేయబోయేది కూడా ఏమీ లేదన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసి అమరావతి వెళ్లారని అంటున్నారని చెప్పారు.