పటేల్ విగ్రహానికి 2500 కోట్లు, అమరావతికి 1500 కోట్లా?: మోడీకి బాబు, అమరావతికి సింగపూర్ 'తెలుగు' సాయం
సింగపూర్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. గుజరాత్లో మోడీ ఒక విగ్రహం నెలకొల్పడానికి రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఉద్దేశించి అన్నారు.
Recommended Video
కానీ, ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణానికి మాత్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇది ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఆయన సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ తెలుగుదేశం ఫోరం సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
దానిని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని ఎన్నారైలకు
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడే తెలుగువారిలో తొంభై శాతం మంది ఐటీ రంగంలో పని చేసే వారేనని చంద్రబాబు చెప్పారు. తాను పాతికేళ్ల క్రితం మొదటిసారి సింగపూర్ వచ్చినప్పుడు తమిళులే ఎక్కువగా ఉండేవారని చెప్పారు. విదేశాలలో స్థిరపడిన తెలుగువారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించేందుకు ఎన్ఆర్టీని స్థాపించామని చెప్పారు. ఎన్ఆర్టీ సేవలు ఉపయోగించుకొని లబ్ధి పొందాలని సూచించారు.
బీజేపీ గట్టిగా మాట్లాడుతోందని భావిస్తే
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ కోసం బీజేపీ నేతలు రాజ్యసభలో గట్టిగా మాట్లాడారని, దాంతో తాము ఏపీకి వారు ఏమైనా చేస్తారని పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. కానీ వారు మన ఆశలను అడియాసలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి మకిలి అంటిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో జత కడుతోందన్నారు. అవినీతి అంటిన పార్టీలు, నేతలు మాత్రమే తమ నియంత్రణలో ఉండాలని బీజేపీ భావిస్తోందన్నారు.
ఏపీకి కేంద్రం సహాయ నిరాకరణ
తమ పాలనలో ఏపీని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఏపీ అబివృద్ధిని చూసి వాళ్లు అసూయ చెంది ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం మోకాలు అడ్డిందని విమర్శించారు. ఏపీకి కేంద్రం సహాయక నిరాకరణ చేస్తోందని ఆరోపణలు చేశారు.
రాజధానికి సాయం చేస్తామన్న ఎన్నారైలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తాము ఆర్థికంగా బాండ్ల రూపంలో అండదండలు అందిస్తామని సింగపూర్ తెలుగు వారు కొందరు చెప్పారు. సొంత డబ్బులతో తెలుగువారిగా రాజధాని నిర్మించుకుందామని సింగపూర్ తెలుగు ఫోరం సభ్యులు చంద్రబాబుతో అన్నారు. అమరావతి నిర్మాణానికి డబ్బులు ఇవ్వమని చేతులు చాచడం తనకు ఇష్టం లేదని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం కోసం, పార్టీ కోసం కొంత సమయాన్ని వెచ్చిస్తే చాలని చెప్పారు.