ఎవరినో కొట్టానని నాపై కేసు పెడతారేమో, పాదయాత్ర అంటే అలా చేయాలి: జగన్పై చంద్రబాబు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (09-01-2019) శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పాదయాత్ర అంటే నిబద్దతతో చేయాలన్నారు.
రాజ్యాంగపరమైన చర్చ జరగాలి
జగన్పై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడం రాష్ట్రం అధికారాల్లోకి కేంద్ర ప్రభుత్వం చొరబడటమే అన్నారు. దీనిపై రాజ్యాంగపరమైన చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. ఎన్ఐఏ చట్టం వచ్చినపుడు వ్యతిరేకించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారన్నారు.
ఎవరినో కొట్టానని తనపై కేసులు నమోదు చేస్తారేమో
ఎవరినో కొట్టానని తనపై కూడా కేసులు నమోదు చేస్తారేమోనని చంద్రబాబు అన్నారు. చిత్తశుద్ధి లేని పాదయాత్రలు ఎన్ని చేసినా ఉపయోగం లేదని జగన్ పాదయాత్రను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాదయాత్ర అంటే నిబద్ధతతో చేయాలన్నారు. రోజుకు ఎనిమిది కిలో మీటర్లు నడిస్తే దానిని పాదయాత్ర అంటారా అని ప్రశ్నించారు. గతంలో ఆరోగ్యం సహకరించకపోయినా తాను పాదయాత్ర చేసి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించానన్నారు.
పేదలకు రిజర్వేషన్లు స్వాగతిస్తున్నాం
అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ల అంశంపై కూడా చంద్రబాబు స్పందించారు. రిజర్వేషన్లను స్వాగతిస్తున్నామని తెలిపారు. కాపు రిజర్వేషన్లతో పాటు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఇప్పుడే అగ్రవర్ణాల రిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయా అన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు.