సంచలనం:ఇదేంటి చంద్రబాబు ఇలా చేశారు...టిడిపిలో విస్మయం!
అమరావతి:బుధవారం ఉదయం టిడిపి ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో ఉన్న టిడిపి ఎంపీలను హెచ్చరిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాను ఏ విషయంలోనూ తొందరపడనని...నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయనని ఎంపీలకు స్పష్టం చేసిన చంద్రబాబు ఎవరూ కేంద్ర పెద్దలతో రహస్య మంతనాలు చేయొద్దన్నారు. అలాగే విభజన హామీలపై ఆందోళన చేసేందుకు ఢిల్లీకి వచ్చిన తెలుగువారికి సహకరించాలని చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతుండగా...మిగిలిన పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఆస్కారం కల్పించినట్లయింది.
టెలీ కాన్ఫరెన్స్ లో...చంద్రబాబు ఏమన్నారంటే...
బుధవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలకు ముందు ఢిల్లీలోని టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తన ఇమేజిని, పార్టీ ఇమేజిని దెబ్బతీసే చర్యలను ఎవరు చేసినా సహించేది లేదన్నారు. అలాగే ఎవరూ రహస్యంగా ఎవరితో మంతనాలు జరపవద్దని...తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పేనని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. మీ చర్యలను ప్రజలందరూ చూస్తున్నారన్నారు. రాష్ట్రానికి న్యాయం ఐదు కోట్ల ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం అని ఎంపీలకు ఉద్భోదించారు. తాను జీవితంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నానని...ఆ సంక్షోభాలను సమర్ధంగా అధిగమించానని ఈ సందర్భంగా చెప్పారు. దేశంలో అందరికంటే ముందు నేను సీఎం అయ్యాను. గతంలోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన నేతను. చిన్న మచ్చ కూడా లేని నాపై కేంద్రం దాడి చేస్తుందా...అని ప్రశ్నించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.
ఢిల్లీ వచ్చిన...తెలుగువారికి సహకరించండి...
అలాగే ఎపికి విభజన హామీల సాధనపై ఆందోళన తెలిపేందుకు ఢిల్లీకి వచ్చిన తెలుగువారికి సహకరించాలని ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కొందరు ఈ విషయమై తనకు ఫిర్యాదు చేశారని, తాము ప్రత్యేక హోదా, ఏపీ విభజన హామీల అమలు కోసం ఆందోళన చేయడానికి ఢిల్లీకి వెళితే తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమకు సహకరించలేదని వారు తనతో చెప్పారన్నారు. ఢిల్లీకి వచ్చిన తెలుగు వారికి సహకరించడం మన బాధ్యతగా గుర్తుంచుకోవాలన్నారు. అందుకు ఏపీ భవన్ ను వేదికగా చేసుకుని వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే ఒప్పుకునేది లేదని ఎంపీలకు చంద్రబాబు సీరియస్ గానే చెప్పారు. మీ చర్యలను ప్రజలందరూ చూస్తున్నారన్నారు.
ప్రత్యేకించి సుజనాకు వార్నింగ్...
అయితే ఆర్థిక మంత్రి జైట్లీతో సుజనా భేటీ విషయం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇంకోవైపు ఆర్థిక మంత్రి జైట్లీతో రహస్య సమావేశాలు జరుపుతోన్న ఎంపీ సుజనా చౌదరి వ్యవహారం పార్టీకి నష్టం కలిగించినట్లు టీడీపీ నేతలు తన దృష్టికి తెచ్చిన విషయం సుజనాతో ప్రస్తావించిన చంద్రబాబు...తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని, ఇకపై ఎవరితోనూ రహస్యంగా మతనాలు జరపొద్దని సుజనాను హెచ్చరించి...ఇదే వార్నింగ్ అందరికీ వర్తిస్తుందని అన్నారట.
చంద్రబాబు...తాజా వ్యాఖ్యలతో కలకలం
అయితే బుధవారం టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అటు పార్టీలోనూ...ఇటు రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారినట్లు తెలిసింది. ఇప్పటివరకు కేంద్ర మంత్రి సుజనా చౌదరితో భేటీ అయ్యారో లేదో స్పష్టత లేదని...అలాంటిది చంద్రబాబే ఆ విషయం నిర్ధారించడంతో ఇప్పుడు సుజనా-జైట్లీ భేటీని నిర్థారించినట్లయిందని...ఇది పార్టీ విశ్వసనీయతను చాలా దెబ్బ తీస్తుందని...టిడిపి వర్గాలు అంతర్గతంగా మథనపడుతున్నాయట. ఒకవేళ టెలీ కాన్ఫరెన్స్ లో ఈ విషయం హెచ్చరించినా దీనిగురించి కూడా లీకు ఇవ్వకుండా ఉండాల్సిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. దీనివల్ల సుజన వ్యవహారంపై లేనిపోని సందేహాలను మనమే కల్పించినట్లయిందని అనుకుంటున్నారట.
మిగతా పార్టీలకు...అస్త్రాలు...
చంద్రబాబు చేసి తాజా వ్యాఖ్యలు విపక్షాలు ముందు ముందు ఎదురు దాడి చేసేందుకు ఆస్కారమిచ్చినట్లయిందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణగా కనిపిస్తోంది. చంద్రబాబు తాజా వ్యాఖ్యల వల్ల కొందరు ఎంపీలు బిజెపి నేతలతో రహస్య చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు తామే ఖరారు చేసినట్లయిందని, తద్వారా టిడిపి ఎంపీలు ఇంత కీలకమైన సమయంలో కూడా బిజెపి నేతలతో సమావేశాలకు సిద్దపడుతున్నారంటే దాని వెనుక ఆంతర్యం ఏమైనా అది టిడిపి ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీసేదేనని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే తమ ఎంపీలు ఢిల్లీకి వచ్చిన వారికి సహకరించడం లేదనే విషయం కూడా పార్టీపై, ఎంపీలపై వ్యతిరేకతను పెంచేదే నని...దిద్దుబాటు సూచనల నేపథ్యంలో చంద్రబాబు సరిదిద్దుకోలేని కొన్ని అభిప్రాయాలకు నాంది పలికినట్లయిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.