టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం: ప్రమాణ పత్రంలో ఏముందంటే..!
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. "మా తెలుగుతల్లికీ మల్లెపూదండ..." పాట అనంతరం మొదలైన కార్యక్రమంలో కేంద్ర కమిటీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ కమిటీల్లో ఎంపికైన వారందరిచేతా ఒకేసారి ప్రమాణ ప్రమాణ పత్రం చదవించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబునాయుడుకి ఒకవైపు తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్ రమణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూర్చున్నారు.
ప్రమాణ పత్రంలో ఈ విధంగా ఉంది. "డాష్ అను నేను (డాష్ అన్న చోట ఎవరి పేరు వారు చదువుకోవాలి) తెలుగుదేశం పార్టీ డాష్ సభ్యునిగా (ఇక్కడ డాష్ అన్న చోట వ్యక్తి కమిటీ, పదవిని చెప్పుకోవాలి) పార్టీ నిర్ణయాలను, ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ, పార్టీ పట్ల పూర్తి విధేయతతో, పార్టీ పటిష్ఠతకు నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."
"నాకు జన్మనిచ్చిన భారతావని సాక్షిగా పవిత్ర రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ సాక్షిగా, నీతి, నిజాయితీతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితమవుతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నైతిక విలువలతో, కుల, మత, వర్గం ప్రాంతీయ తత్వాలకు అతీతంగా, పేదరిక నిర్మూలనకు, రైతు వికాసం మరియు సర్వప్రజల సంక్షేమానికి, ఆదర్శవంతమైన సమాజం కొరకు అవిరళ కృషి చేస్తాను."
ప్రజా జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ, ప్రజాసేవే పరమావధిగా పార్టీ నియమాలను అనుసరించి తెలుగు జాతి సమగ్ర పయోజన పరిరక్షణకు కృషి చేస్తాను. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, ఆత్మ విశ్వాసంతో పురోగమిస్తూ, శాంతి, సౌభాగ్యాలతో కూడిన సమసమాజ అభివృద్ధికి అవిశ్రాంతంగా మనసా, వాచా, కర్మేణా కృషి చేస్తానని, మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అని సభ్యులచే ప్రమాణం చేయించారు.
ఆదివారం ఉదయం ఎన్టీఆర్ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రలలోని వివిధ జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉన్న బంజారాహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది.