నేడు,రేపు సిఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన...పవన్ కళ్యాణ్ రైలు యాత్ర నేడే
అమరావతి:సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం వెలుగొండ ప్రాజెక్టు సందర్శనతో సిఎం పర్యటన ప్రారంభం కానుంది.
ఈ రెండు రోజుల ప్రకాశం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిసింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు రైలు యాత్ర చేయనున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ ఈ పర్యటన వివరాలు వెల్లడించడంతో పాటు ఈ యాత్రకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ ను సైతం విడుదల చేసింది.
ప్రమాదంలో దేశం, కాంగ్రెస్తోను విభేదాలు, మోడీ కంటే గొప్పగా చేస్తారు: రాహుల్కు చంద్రబాబు ప్రశంస
ప్రకాశం జిల్లా...సిఎం పర్యటన
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్ర, శనివారాల్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం ఎపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగం నిర్మాణ పనులను సిఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మొదటి టన్నెల్ ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష ముగిసిన తదుపరి మార్టూరు మండలం డేగరమూడిలో గ్రామదర్శిని, బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
జిల్లాలో ...పార్టీ పరిస్థితులపై సమీక్ష
సాయంత్రం ప్రకాశం జిల్లా పార్టీ సమావేశం నిర్వహించి, పార్టీ స్థితిపై జిల్లా ముఖ్యనేతలతో చర్చిస్తారు. ముఖ్యంగా యుర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారని తెలిసింది. అలాగే జిల్లాలో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు...అసమ్మతి రాగాలపై తదుపరి కార్యాచరణ ఇలా పూర్తి స్థాయిలో జిల్లా రాజకీయాలపై సమీక్ష జరుగుతుందని తెలిసింది. అలాగే శనివారం ప్రకాశంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సిఎం సమీక్షిస్తారు.
పవన్ కళ్యాణ్...రైలు యాత్ర
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు రైలు యాత్ర నిర్వహించనున్నారు. సమకాలీన రాజకీయాల్లో వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి తుని వరకు జన్మభూమి ఎక్స్ప్రెస్లో జనంతో కలిసి రైల్లో ప్రయాణించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ జర్నీకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు విజయవాడ లో జన్మభూమి ఎక్స్ప్రెస్లో ఎక్కడం ద్వారా యాత్రను ప్రారంభించి...సాయంత్రం 5.20 నిమిషాలకు తుని రైల్వే స్టేషన్లో దిగడంతో కార్యక్రమం ముగియనుంది. ఈ ప్రయాణంలో ప్రజా సమస్యలు, జనసేన పార్టీ ఆశయాలు తదిదర అంశాలను పవన్ కల్యాణ్ స్వయంగా ప్రయాణికులకు వివరిస్తారు.
జనసేన శ్రేణులకు...సూచనలు
పవన్ కళ్యాణ్ ఈ రైలు యాత్ర చేపట్టిన నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలకు జనసేన పార్టీ పలు సూచనలు చేసింది. విజయవాడ నుంచి తుని వరకూ వివిధ స్టేషన్లో పవన్కు శుభాకంక్షలు తెలిపేందుకు వచ్చే వాళ్లు విధిగా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని, వాటిని బ్యాడ్జిలుగా ధరించి రావాలని సూచించారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో పాటు రైలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దని పేర్కొన్నారు. పవన్ ప్రజలతో మమేకయ్యేలా వీలు కల్పించాలని కోరింది. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్త వహించాలని తెలిపింది.