ఓటుకు నోటు కేసువల్లే బాబు నోరెత్తడం లేదా?: ఉండవల్లి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి చిన్న విషయానికి ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు.
రాజమండ్రి:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి చిన్న విషయానికి ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు.
అసెంబ్లీలోకి వర్షపునీరు లీకేజీ వ్యవహరాన్ని కవర్ చేసేందుకు మీడియాకు అనుమతించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబునాయుడు టిడిపిలో సీనియర్ అంటూ చెప్పుకొంటున్నారని చెప్పారు.
టిడిపిలో ఆయన కంటే మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి సీనియర్ అని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబులో ఏర్పడిన అత్మన్యూన్యత భావం రాష్ట్రానికి ప్రమాదమన్నారు అరుణ్ కుమార్ .
రాహుల్ గాంధీ గుంటూరుకు వస్తే టీడిపి నాయకులు నిరసన వ్యక్తం చేయించడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. విభజన జరిగినప్పుడు టిడిపి ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, రమేష్ రాథోడ్ లు పార్లమెంట్ లో ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్ర విభజన సమయంలో నోరెత్తని చంద్రబాబునాయుడు రాహుల్ ఏపీకి వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేయడాన్ని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. రూ.4 వేల కోట్లు విద్యుత్ బకాయిలు తెలంగాణ నుండి రావాల్సి ఉన్నా ఇప్పటివరకు నోరెత్తకపోవడానికి కారణం ఓటుకు నోటు కేసేనా అని ఆయన నిలదీశారు.