జైట్లీ వ్యాఖ్యలు బాధించాయి, మీలా మీ అధిష్టానం ఎందుకు లేదు: బీజేపీ నేతలకు బాబు
అమరావతి: అన్ని రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ ఇవ్వలేమని, 29 రాష్ట్రాలను సమానంగా చూడాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఏపీ సీఎం చంద్రబాబు గురువారం అన్నారు. బీజేపీ మంత్రులు మాట్లాడిన అనంతరం చంద్రబాబు శాసన సభలో మాట్లాడారు.
తాను 29 సార్లు ఢిల్లీ వెళ్లానని, కానీ ఏపీకి ఏమీ ఇవ్వలేదన్నారు. ఇద్దరు మంత్రులు మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస రావులు బాగా పని చేశారని, అందుకు అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. మంత్రులుగా మంచి సంస్కరణలు తీసుకు వచ్చారని చెప్పారు. సమర్థవంతంగా మంత్రి పదవిని నిర్వహించారన్నారు.
ఏపీ బీజేపీ మంత్రులు జనాల కోసం పని చేశారని, కేంద్రం ఎందుకు అలా ఆలోచించడం లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. విభజన హామీలపై సమాధానం చెప్పకుంటే ఎలాగని ప్రశ్నించారు.
ఇవన్నీ మీ బాధ్యత, మేం లెక్క చెప్పలేదా: జైట్లీకి బాబు షాక్, ఇదీ పోలవరం లెక్క
దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయని, అన్నింటిని సమానంగా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం చెప్పారని, అది తనను బాధించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఏపీ అసెంబ్లీలో గురువారం మాట్లాడారు.
రాష్ట్ర విభజనలో హేతుబద్దత లేదన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ జాతీయ పార్టీలు ఇలా ప్రవర్తిస్తే ఎలా అన్నారు.
ఏఏ రాష్ట్రాలకు ఏమిచ్చారు, ఏపీకి ఏమిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి అందరికంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్పడం బాధించిందన్నారు. తనకు ఎవరి పైనా కోపం లేదన్నారు. నిన్న జైట్లీ వ్యాఖ్యలు బాధించాయన్నారు.