అందుకే అఖిలప్రియ సహా వారికి పదవులు, ఇలా జరిగిందా: ఊగిపోయిన చంద్రబాబు
ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో అసంతృప్తులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దు దాటితే ఉపేక్షించేది లేదని, వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని, క్రమశిక్షణ దాటితే ఇష్టమైన వాళ్లనూ వదులుకున్న సందర్భాలున్న
అమరావతి: ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో అసంతృప్తులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దు దాటితే ఉపేక్షించేది లేదని, వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని, క్రమశిక్షణ దాటితే ఇష్టమైన వాళ్లనూ వదులుకున్న సందర్భాలున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తనకు వచ్చి చెప్పాలే తప్ప పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించబోనని హెచ్చరించారు. సోమవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 260 మంది వరకు దీనిలో పాల్గొన్నారు.
పదవులు రాలేదన్న అసంతృప్తితో బహిరంగ ఆందోళనలకు దిగుతున్న నాయకుల తీరుపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఇలాంటివి ఎంతమాత్రం సహించేది లేదని ఘాటుగానే అక్షింతలు వేశారు.
చంద్రబాబు షాక్: కార్యకర్తలకు జ్యోతుల సందేశం, నాకివ్వకపోయినా..
అందుకే కొత్త వారిని తీసుకొచ్చాం
రాజకీయ ఏకీకరణ కోసమే కొత్తవారిని పార్టీలోకి తీసుకు వచ్చామని, పదవులు ఇవ్వకుండా వదిలేస్తే వారితో పాటు, ప్రజలూ మనల్ని విశ్వసించరని, టిడిపిలోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుందని, ప్రజలకు మేలు చేయగలమన్న భావన అందరిలో ఏర్పడాలంటే వారికి పదవులు ఇవ్వక తప్పదన్నారు.
అన్నీ మనవాళ్లకే ఇస్తే మరో నాలుగు పదవులు మాత్రమే వస్తాయని, దాని వల్ల రాజకీయ ఏకీకరణ ఎలా జరుగుతుందని, రాజకీయాల్లో ఇలాంటివన్నీ అవసరమేనని, శ్రీకృష్ణదేవరాయలులా పాలన అందించడంతో పాటు, అవసరమైనప్పుడు చాణక్యనీతినీ ప్రయోగించాని చంద్రబాబు అన్నారు.
ప్రతిపక్షం ఉండొద్దు
పార్టీ లేకపోతే మనమంతా ఎక్కడ ఉంటామని, పార్టీకి నష్టం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటే ప్రయోజనం లేదని, మనకి వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. పార్టీలోని ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తామని, హద్దుదాటితే మాత్రం ఎవర్నీ ఉపేక్షించనని తేల్చి చెప్పారు. ఏ జిల్లాలో ఎవరి పరిస్థితి ఏమిటో తనకు తెలుసునని, సమస్యలుంటే తనతో మాట్లాడాలన్నారు.
ఎప్పుడైనా ఇలా జరిగిందా?
మీరు జిల్లాలకు పరిమితమై అడుగుతున్నారని, నేను జిల్లాతో పాటు, రాష్ట్రస్థాయిలోను, సామాజిక సమీకరణాల వారీగా కూడా చూసుకోవాలన్నారు. ఏదైనా ఒక జిల్లాలో ఇంకా ఎక్కువ పదవులు ఇస్తే బాగుటుందని తనకూ ఉంటుందని, రాష్ట్రాన్ని ప్రామాణికంగా చేసుకున్నప్పుడు మాత్రం చేయలేని పరిస్థితులు ఉంటాయన్నారు. కొన్ని చోట్ల రాజకీయ అవసరాల దృష్ట్యా కొన్ని ఎక్కువ పదవులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న లక్ష్యంతో పని చేస్తుంటే, నాయకులు ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. పార్టీలో ఎప్పుడైనా ఇలా ఉందా? ఇప్పుడు కొత్త సంప్రదాయం ఎందుకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే కార్యకర్తలు మీకు ఎదురు తిరిగే పరిస్థితి..
కొందరు నాయకుల వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం జరిగితే ఎవరు భర్తీ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మనం పడుతున్న కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయవద్దన్నారు. ఇప్పుడు నాయకులు కార్యకర్తలని తనపైకి ప్రయోగిస్తే రేపు అదే కార్యకర్తలు వారికే ఎదురు తిరిగే పరిస్థితి వస్తుందన్నారు. అంతర్గత విభేదాలతో వల్ల ఇతర రాష్ట్రాల్లో పార్టీలు ఏ విధంగా నష్టపోతోందో గుర్తించాలన్నారు. మంత్రివర్గంలో 26 మందికే అవకాశముందన్నారు.