సర్వే తెప్పించా, అభ్యర్థుల్ని మారుస్తా, పేపర్ తెచ్చిస్తారు పోస్ట్మ్యాన్నా: బాబు ఆగ్రహం, హెచ్చరిక
అమరావతి: ఈ మధ్య సర్వే తెప్పించుకున్నానని, అత్యధిక స్థానాల్లో మన పరిస్థితి బాగుందని, కొద్ది స్థానాల్లో ఎమ్మెల్యేల తీరు మెరుగుపడాలని, లేదంటే అవసరం అనుకుంటే అభ్యర్థులను కూడా మారుస్తానని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
Recommended Video
చదవండి: జగన్ గురించి ఆరా: మోడీతో విజయసాయి భేటీ, చక్రం తిప్పుతున్నారా, బాబుకు షాకేనా?
చదవండి: ఫోటో ఎఫెక్ట్, దిమ్మతిరిగే షాక్: మహేష్ కత్తిపై హైపర్ ఆది మరో 'జబర్దస్త్' పంచ్
జన్మభూమి - మా ఊరుపై ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏదైనా సమస్య వస్తే ఎవరి స్థాయిలో వారు నిర్ణయాలు తీసుకొని చక్కదిద్దాలన్నారు. కానీ ప్రతి విషయాన్ని తనకు రిపోర్ట్ చేసి, ఓ కాగితం ఇచ్చి వెళ్తున్నారని, చివరకు తనది పోస్ట్ మాన్ ఉద్యోగంలా తయారయిందన్నారు.
చదవండి: జగన్కు షాక్: రాజీనామాకు అందరూ ఒకే కారణం చూపారు! రంగంలోకి నేతలు
ఓడిపోతే మీదే బాధ్యత
జిల్లా ఇంచార్జ్ మంత్రులు, పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇంచార్జులుగా ఉన్న మంత్రులు కీలకంగా వ్యవహరించాలని, ఎవరికి అప్పగించిన జిల్లాలో, పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మొత్తం శాసనసభా స్థానాల్ని గెలిపించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎవరైనా ఓడిపోతే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంద చెప్పారు. ప్రతి సీటూ గెలవాలన్న తపన ఇప్పటి నుంచే ఉండాలని, భవిష్యత్తులో పదవులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తానని చెప్పారు.
మీలో మాత్రం మార్పు రావడం లేదు
ప్రజల్లో ఉండటం, వారి కోసం పని చేయడం ఒక్కటే మనం గెలిచేందుకు సూత్రం అని, కానీ గెలిచేందుకు దగ్గరి దారులు అంటూ ఉండవని చంద్రబాబు హితబోధ చేశారు. ప్రజల మనసులు గెలుసుకోవాలన్నారు. జనవరి 2 నుంచి జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వంలో మార్పు తీసుకురాగలిగానని, ఎన్నిసార్లు చెప్పినా పార్టీ నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు.
అభ్యర్థులను మారుస్తా, త్వరలో చెప్తా
రాష్ట్రంలో కొద్దిమంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగా లేదని, వారి సంఖ్య చెప్పదల్చుకోలేదని, వారిని పిలిచి మాట్లాడుతానని, ఇప్పటికీ సమయం మించి పోలేదని, వారు కూడా ప్రజల్లో ఉంటే వ్యతిరేకతను అధిగమించవచ్చునని, కానీ తీరు మార్చుకోకుంటే అభ్యర్థులను మారుస్తానని చంద్రబాబు హెచ్చరించారు. వివిధ కొలమానాల ఆధారంగా నియోజకవర్గాలను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించానని, ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
నన్ను నిందించొద్దు, 25 ఎంపీ సీట్లు గెలుస్తాం
పని తీరు మెరుగుపర్చుకోకుంటే, అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి వస్తే అది మీ వైఫల్యం అని, ఆ తర్వాత తనను నిందించవద్దని చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రణాళక ప్రకారం పని చేస్తే 25 ఎంపీ స్థానాలను గెలుచుకుంటామన్నారు. అవసరమైతే నియోజకవర్గాల్లోని కిందిస్థాయి నేతలను కూడా పిలిచి మాట్లాడుతానని చెప్పారు. ప్రజాప్రతినిధులు పార్ట్ టైం నేతలుగా వ్యవహరించవద్దన్నారు. ఫుల్ టైం పని చేస్తేనే గెలుపు అన్నారు. విశాఖలో ఎస్సీ మహిళపై జరిగిన దాడి ఘటన గురించి మాట్లాడుతూ.. అలాంటి ఘటనలు సరికాదని, అవి పునరావృతం కావొద్దని, ఎస్సీల్లోని అన్ని వర్గాలు మనవైపే ఉన్నాయన్నారు.
ఓటు వేయలేదని దూరం పెట్టవద్దు
బలహీనవర్గాలపై దాడుల వంటి సంఘటనల్ని సహించనని చంద్రబాబు చెప్పారు. విశాఖ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు పరిస్థితి చక్కదిద్దడానికి చాలా సమయం పట్టిందని, మనం ఎప్పుడూ బలహీనవర్గాల పక్షానే ఉండాలన్నారు. ఫలానావాళ్లు గత ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదంటూ ఎవరినీ దూరం పెట్టవద్దని, గత ఎన్నికల్లో మీకు ఏ 52 శాతమో ఓట్లు వచ్చి ఉంటాయని, అప్పుడు ఓట్లు వేయలేదని అందరినీ దూరం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపు కష్టం అవుతుందని చంద్రబాబు అన్నారు.
ఓ సామాజిక వర్గానికి కొమ్ముకాయవద్దు
ఎవరు కూడా ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాయడం సరికాదని చంద్రబాబు అన్నారు. లేకపోతే కొన్నివర్గాల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని, అది విభేదాలకు దారి తీస్తుందని చెప్పారు. కొన్ని బీసీ కులాలను ఎస్సీల్లో చేర్చే హామీకి కట్టుబడి ఉన్నామని, ఇందులో కేంద్రం చేయాల్సిందే ఎక్కువ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు, ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఫాతిమా విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తే కోర్టు కొట్టేస్తుందంటున్నారని, న్యాయపరంగా అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కోడిపందేలను ప్రోత్సహించవద్దని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన క్లాస్ తీసుకున్నారు. మీరే దగ్గరుండి ఆడించడం సరికాదన్నారు. రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తే లేనిపోని సమస్యలు వస్తాయన్నారు.