ఎన్నికల టైంలో ఏం మాటలవి: పవన్ కళ్యాణ్తో పొత్తు, టీజీపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, కర్నూలు జిల్లా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పైన ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వార్నింగ్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్పై కూల్గా పావులు కదుపుతున్న బాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!
టీజీ వెంకటేష్పై చంద్రబాబు సీరియస్
పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని చంద్రబాబు.. టీజీ వెంకేటష్ పైన సీరియస్ అయ్యారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురి చేయవద్దని హెచ్చరించారు. పార్టీ విధానాల పైన కామెంట్లు చేసే సమయంలో సంయమనం కోల్పోవద్దని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఏమిటన్నారు.
పొత్తుపై టీజీ సంచలనం
అంతకుముందు, టీజీ వెంకటేష్ జనసేన, టీడీపీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య విభేదాలు లేవని, కేవలం కేంద్రం పైన పోరాటం చేసే విషయంలోనే రెండు పార్టీలకు అభిప్రాయ బేధాలు ఉన్నాయని చెప్పారు. సీఎం కుర్చీపై తనకు ఆశ లేదని పవన్ గతంలో పలుమార్లు చెప్పారని అన్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన కలవడంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు.
పొత్తుపై ప్రచారం
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం గత కొంతకాలంగా ఏపీలో జరుగుతోంది. టీడీపీ నేతల వ్యాఖ్యలు కూడా అందుకు ఊతమిచ్చాయి. పదేపదే పవన్ కళ్యాణ్ను వారు తమ కూటమిలోకి ఆహ్వానించారు. వారి మధ్య చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా సాగింది. దీంతో పొత్తుకు అవకాశాలు ఉంటాయనే వ్యాఖ్యలు వినిపించాయి. నిన్నటి వరకు జగన్, పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఆ తర్వాత క్రమంగా తగ్గించారు. ఇది కూడా అనుమానానికి తావిచ్చింది. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.