'వైయస్ను ఓడించాలని జూ.ఎన్టీఆర్, బాబు అలా చేస్తే అర్థం మారిపోతుంది'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు పిల్లను ఇచ్చిన మామ నుంచి అన్నీ వెన్నుపోట్లేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు అంబటి, వరప్రసాద్, బీవై రామయ్య తదితరులు వేర్వేరుగా ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు.
పులివెందులలో జగన్కు చెక్ చెప్పేలా ప్లాన్: టీడీపీలోకి రెడ్డి బ్రదర్స్, అందుకే
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు టీడీపీలోకి వచ్చారని విమర్శించారు. చంద్రబాబు తన ఎదుగుదల కోసం జూనియర్ ఎన్టీఆర్ను వాడుకున్నారన్నారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని సినిమా తారలను తీసుకు వచ్చారని, శ్రీకాకుళం నుంచి ఏపీ అంతా ప్రచారం చేయించి, ఆ తర్వాత జూనియర్ను వదిలేశారన్నారు.
చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారు
చంద్రబాబు దీక్ష 420 దీక్ష అని వైసీపీ నేత బీవీ రామయ్య విమర్శించారు. దీక్ష పేరుతో చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారన్నారు. కుట్రలు, కుతంత్రాలతో ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి కొంగజపం చేస్తున్నారన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు, ఆమరణ దీక్షకు కలిసిరాని చంద్రబాబు ఇప్పుడు ఒకరోజు దీక్ష చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు.
Recommended Video
ఇన్నాళ్లు బీజేపీతో కలిసి ఉండి
హోదా విషయంలో నాలుగేళ్లుగా కాలయాపన చేసి ఇప్పుడు చంద్రబాబు దీక్షకు దిగటం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ వరప్రసాద్ అన్నారు. మళ్లీ ప్రజలను మోసం చేసేందుకే ఆయన దీక్ష చేపడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి నాలుగేళ్లుగా హోదాను కాలరాసి ఇప్పుడు చేస్తున్న దీక్ష కొంగజపం లాంటిదన్నారు. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి ఉండి ఇప్పుడు వ్యతిరేకంగా దీక్ష చేపట్టడం హాస్యాస్పదం అన్నారు.
చంద్రబాబు దీక్ష చేపడితే అర్థం మారిపోతుంది
ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతుందని భావించిన చంద్రబాబు మళ్లీ కొత్త చక్రాలను వెతుక్కుంటూ బయటకు వచ్చి ఏదోవిధంగా ప్రజలను మభ్యపెట్టేందుకు దీక్ష చేపడుతున్నారని వరప్రసాద్ అన్నారు. దీక్ష ప్రజాస్వామ్యానికి ఆయుధమని, కానీ చంద్రబాబు లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకులు దీక్ష చేపడితే దాని అర్థం మారిపోతుందన్నారు.
2019 ఎన్నికల వల్లే చంద్రబాబు దీక్ష
పరిపాలన అంతా జన్మభూమి కమిటీల్లోనే పెట్టారని, కలెక్టర్లకు అధికారాలు లేకుండా చేశారని వరప్రసాద్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులెలా ఇస్తారని నిలదీశారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో చైతన్యం రావడానికి జగన్, వైసీపీనే కారణమన్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు.
చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టారు
హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని, చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టారని, ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు ఆయనకు లేదన్నారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందన్నారు. ప్రతి రంగంలో ఉన్నవారిని మోసం చేసి ఓట్లు వేయించుకుని, తన తప్పు లేదన్నట్లు చంద్రబాబు బీజేపీపై నెపాన్ని నెడుతున్నారన్నారు. హోదా కోసం తాము మొదటి నుంచి పోరాడుతున్నామని, తాము అవిశ్వాసం పెడతామన్నాకే టీడీపీ ముందుకు వచ్చిందన్నారు.