'ఊహా ప్రపంచం కోసం సీఎం ఖర్చులు, లెక్కలివీ', లక్ష కోట్లు ఎలా: బాబు ప్రశ్న
అమరావతి: అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారని, స్కాంలు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటే, సుపరిపాలన అందిస్తుంటే విమర్శిస్తున్నారని టిడిపి అంటోంది.
గురువారం కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య కడప జిల్లాలో మాట్లాడారు. చంద్రబాబు దుబారా ఖర్చులు చేస్తున్నారని చెబుతూ లెక్క చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఊహా ప్రపంచంలో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
గోదావరి పుష్కరాలకు రూ.18 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.16 కోట్లు ఖర్చు చేశారన్నారు. రాజధాని పండుగ పేరుతో బాణసంచాకు రూ.80 లక్షలు ఖర్చు చేశారన్నారు. ప్రత్యేక విమానం, అతిథి గృహానికి రూ.40 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
ఈ సొమ్ము అంతా ఎవరిదని ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో లోటు బడ్జెట్ రూ.4600 కోట్లుగా ఉందనుకుంటే ఇప్పుడు రూ.9 వేల కోట్లు దాటిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్నారని వైసిపి కూడా ఆరోపిస్తోంది.
మరోవైపు, చంద్రబాబు ఈ రోజు వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) వర్సిటీకి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎంతమంది రెచ్చగొట్టినా రైతులు స్వచ్చంధంగా రాజధానికి భూములు ఇచ్చారన్నారు.
రాజధానిని అడ్డుకునేందుకు హైకోర్టు, సుప్రీం కోర్టు, గ్రీన్ ట్రైబ్యునల్ దాకా వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని వైసిపిని ఉద్దేశించి అన్నారు. ఎవరు ఎన్ని చేసినా రైతులు తమకు మద్దతిచ్చారన్నారు. ప్రతి దానికి అడ్డుపడితే ఎలాగని విపక్షాలను ప్రశ్నించారు. హోదా రానప్పుడు ప్యాకేజీ తీసుకుంటే తప్పేమిటన్నారు. రైతులకు ప్లాట్ల పంపిణీ ప్రారంభం కాకముందే అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కొందరు ప్రచారం చేసారని మండిపడ్డారు.