బీజేపీ ఎఫెక్ట్, ఆత్మరక్షణలో టీడీపీ: ఢిల్లీకి చంద్రబాబు, విజయసాయికి అనిత కౌంటర్
అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో పాటు టీడీపీ వైపు కూడా విపక్షాలు వేళ్లు చూపిస్తున్నాయి. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉండి, ప్రత్యేక హోదా కోసం విపక్షాలు ఉద్యమించినప్పుడు కేసులు పెట్టి, ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారని మండిపడుతున్నారు. మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీపీఎం మధు టీడీపీని కడిగేశారు.
మొదట సుజననే పెట్టారు!: మోడీ కాళ్లకు నమస్కారంపై విజయసాయిరెడ్డి
ఓ విధంగా చంద్రబాబు ఇరుకునపడిపోయారని అంటున్నారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వమని నాలుగేళ్ల క్రితమే చెప్పిందని, అప్పుడు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్లు అంటకాగి, ఇప్పుడు హఠాత్తుగా హోదా ఉద్యమంలోకి వచ్చారని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు, ఢిల్లీలో అవిశ్వాస తీర్మానం వేడి రాజుకుంది.
ఆత్మరక్షణలో.. ఏప్రిల్ 2న ఢిల్లీకి చంద్రబాబు
రాష్ట్రంలో పూర్తిగా చంద్రబాబు ఆత్మరక్షణలో పడిపోయారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో ఆయన దేశ రాజధానిలో పర్యటించనున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టనున్నారని సమాచారం. 3వ తేదీన అక్కడే వివిధ పార్టీ నేతలతో భేటీ కానున్నారు.
హోదాపై కేంద్రం మీద మరింత ఒత్తిడి
ఇప్పటికే అవిశ్వాసానికి కాంగ్రెస్ సహా ఎన్నో పార్టీలు మద్దతిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రయత్నాలు చేయనున్నారని తెలుస్తోంది. హోదాతో పాటు విభజన సమస్యలు, హామీల అంశాలని జాతీయ నేతల దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. తద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేయనున్నారు.
ప్రధానికి ఏం సంబంధమో అర్థం కావట్లేదు.. అనిత
కాగా, చంద్రబాబుపై విజయ సాయి రెడ్డి విమర్శలు చేయడంపై వంగలపూడి అనిత మండిపడ్డారు. అవిశ్వాసం అంటూనే విజయ సాయి ప్రధాని మోడీ కాళ్లకు మొక్కారన్నారు. ఆర్థిక నేరస్తుడితో ప్రధానికి ఏం సంబంధమో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబును విమర్శిస్తారా అన్నారు. కేసుల మాఫీ కోసమే ప్రజల హక్కులను పణంగా పెడుతున్నారన్నారు.
హోదా అంటూనే పాదాభివందనం.. కొణకళ్ల
విజయ సాయి రెడ్డి పాదాభివందనం చేయడంపై టీడీపీ ఎంపి కొణకళ్ల నారాయణ స్పందించారు. సాయిరెడ్డి నిజస్వరూపం తెలిసిపోయిందన్నారు. హోదా కోసం పోరాటం అంటూనే పాదాభివందనం చేస్తున్నారన్నారు. ఏపీకి న్యాయం చేయాలంటూ వైసీపీ చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు.
రాజీనామా చేసినా ఒప్పందం
వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినా ఈ ఏడాది స్పీకర్ ఆమోదించకుండా ఒప్పందం కుదుర్చుకుంటారని కొణకళ్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంపై బీజేపీ కుంటి సాకులు చెబుతోందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా తెలుస్తుందనే భయంతో ఈ చర్చను జరగనీయడం లేదన్నారు.