కొరియా నగరాల్లా ఉండాలి: 'కియా'పై బాబు నిలదీత, దుష్టశక్తులంటూ జగన్పై..
పెనుకొండ సమీపంలో ఏర్పాటవుతున్న కియా కార్ల పరిశ్రమ ప్రాంతంలో దక్షిణ కొరియాలోని నగరాల కళ కనిపించాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
అనంతపురం: పెనుకొండ సమీపంలో ఏర్పాటవుతున్న కియా కార్ల పరిశ్రమ ప్రాంతంలో దక్షిణ కొరియాలోని నగరాల కళ కనిపించాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
పాదయాత్రలో ఖర్చులు: వాటి మాటేమిటి... జగన్కు సొంత పార్టీ వారు షాకిచ్చారు
ఆదివారం ఆయన పుట్టపర్తి నుంచి హెలికాప్టర్ ద్వారా కియా ప్లాంటు ఏర్పాటు కోసం జరుగుతున్న భూముల అభివృద్ధి పనులను పరిశీలించారు. మొత్తం మూడుసార్లు హెలికాప్టర్తో ఆ ప్రాంతంలో కలియ తిరిగి పనులను ఆసాంతం చూశారు.
కియా పనులపై చంద్రబాబు ఆరా
అంతకుముందు పుట్టపర్తిలో అధికారులతో సమావేశమయ్యారు. కియా పనులపై సమీక్షించారు. పనులు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టరు వీరపాండ్యన్.. చంద్రబాబుకు వివరించారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ భూములను చదును చేస్తోందని, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతమయ్యాయన్నారు.
ఎల్ అండ్ టి అధికారులను నిలదీసిన బాబు
మొత్తం ఐదు దశల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, 3 దశల్లో పూర్తి చేశామని, 4, 5 దశల పనులు 36 శాతం పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ... 4, 5 దశల పనులు ఎందుకు వేగంగా జరగడం లేదని ఎల్ అండ్ టీ ప్రతినిధులను నిలదీశారు. నవంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఆదేశం
అవసరమైతే మరింత యంత్ర సామగ్రిని తెచ్చుకుని పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని సూచించారు. కియా ప్లాంటుకు నీటిని అందించే పనులను పరిశీలించారు. గొల్లపల్లి రిజర్వాయరును సుందరీకరించాలని ఆదేశించారు. గొల్లపల్లి రిజర్వాయరు నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మిస్తున్న రహదారి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కియా ప్లాంటు నుంచి ప్రధాన రహదారికి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఒక రైలు పై వంతెన, రైలు కింది వంతెన పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
అమెరికాలో వలె అనంతపురంలో
కాగా, కియా ప్లాంటు పనుల్లో భాగంగా వచ్చే నెల 10 దక్షిణ కొరియా, అమెరికాల్లో పర్యటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారుల బృందం వెళ్లనుంది. వీరు దక్షిణ కొరియాకు వెళ్లి కియా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. అమెరికాలో కియా ప్లాంటులాగే అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడానికి కియా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని జార్జియాలో ఆ కంపెనీ ప్లాంటును పరిశీలించి దాని ప్రత్యేకతలను అధికారులు చూసి రానున్నారు.
దుశ్ట శక్తులు అడ్డుపడుతున్నాయని జగన్ను ఉద్దేశించి బాబు
ఇదిలా ఉండగా, విజయవాడ కనకదుర్గమ్మ వద్ద ఐదు సంకల్పాలను చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమ్మవారి చల్లని చూపుతో అవి విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. దసరా రోజు రాజరాజేశ్వరీదేవి రూపంలోని అమ్మవారిని చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఏ పని చేయాలన్నా దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు.
అందుకే దేవాన్ష్ను తీసుకు వచ్చా
అందుకే అమ్మవారి వద్ద స్వచ్ఛతే సేవ, వాటర్ గ్రిడ్, స్మార్ట్ పవర్ గ్రిడ్, పోలవరం, అమరావతి నిర్మాణం.. ఈ ఐదు సంకల్పాలను చేశానన్నారు. అమ్మవారి దసరా సంబరాలను వచ్చే ఏడాది నుంచి మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. మన సంప్రదాయాలు చాలా ఉన్నతమైనవని, వాటిని నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే మనవడు దేవాన్ష్ని దుర్గమ్మ దర్శనానికి తీసుకొచ్చానని చెప్పారు.