ఎమ్మెల్యేను చంపడం కోసం అబద్దం!: మావోయిస్టులపై బాబు, కొడుక్కి గ్రూప్ 1 జాబ్
అరకు: ఇటీవల మావోయిస్టుల ఘాతుకానికి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ బలైన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు.
కిడారి సర్వేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. సమర్థుడైన నాయకుడు సర్వేశ్వర రావును కోల్పోయామన్నారు. అతని చిన్న కొడుక్కి గ్రూప్ వన్ ఉద్యోగం, విశాఖపట్నంలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. నలుగురు కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున రూ.20 లక్షలు ఇస్తామని చెప్పారు.
సర్వేశ్వర రావు కుటుంబానికి రూ.ఒక కోటి ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. మావోయిస్టులు మైనింగ్కు వ్యతిరేకంగా హత్యలు చేశారని చెప్పడాన్ని ఆయన ఖండించారు. బాక్సైట్ మైనింగ్కు అనుమతులు ఎప్పుడో రద్దు చేశామని చెప్పారు. మైనింగ్ అనుమతుల రద్దు సంగతి పాడేరు బహిరంగ సభలోనే చెప్పానని అన్నారు.
మైనింగ్ చేస్తున్నారని చెప్పి హత్యలు చేయడం కేవలం సాకు మాత్రమేనని చంద్రబాబు అన్నారు. కిడారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. అభివృద్ధి కోసం పాటుపడే వారిని చంపేస్తే గిరిజన గ్రామాలు ఎలా బాగుపడతాయన్నారు.
కిడారి గిరిజనులకు ఎంతో సేవ చేశారన్నారు. సర్వేశ్వర రావు మంచి నాయకత్వం ఉన్న నేత అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆయన మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
అరకు ఘటనపై ప్రభుత్వం సీరియస్
అరకు ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. కీలక అధికారులపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాస్థాయి అధికారులపై బదలీ వేటు పడే అవకాశముంది.