పీకే... నువ్వెవరు ఓట్లు తొలగించేందుకు, తేల్చుకుందాం రా, తోక కట్ చేస్తా: చంద్రబాబు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో ఉండి మన ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం మండిపడ్డారు. పార్టీ డేటా అనేది తమ వ్యక్తిగత ఆస్తి అని చెప్పారు.
డేటా చోరీ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ
మా డేటాను మేం కాపాడుకోగలమని వ్యాఖ్యానించారు. డేటా అప్ డేట్ చేస్తుంటే దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నియంత ఆటలు తన వద్ద పని చేయవని అన్నారు. జగన్, కేసీఆర్ల పునాదులతో సహా కదిలిస్తానన్నారు. వారు మర్యాదగా ఉంటే తాను అలాగే ఉంటానన్నారు.
తేల్చుకుందాం రండి
కేసీఆర్ ప్రభుత్వానికి అసలు డేటా అనేదే లేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ దొంగ ఫిర్యాదులు చేస్తే తమపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదు ఖబడ్దార్ అని హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వస్తే ఏపీకి నీళ్లు కూడా రావన్నారు. కేసీఆర్, మోడీలు ముసుగులో గుద్దులాట వద్దని, నేరుగా ఏపీ ప్రజాక్షేత్రంలోకి రావాలని, అప్పుడు తేల్చుకుందామన్నారు.
పీకే.. తోకలు కట్ చేస్తాం
బీహార్ నుంచి ప్రశాంతి కిషోర్ (పీకే) అని ఒకరు వచ్చారని, ఆయన వైసీపీకి సలహాదారు అని చంద్రబాబు అన్నారు. పీకే.. ఇది బీహార్ కాదు.. ఆంధ్రప్రదేశ్.. తోకలు కట్ చేస్తామని ఏపీ సీఎం హెచ్చరించారు. అసలు ఓట్లు తొలగించేందుకు పీకే ఎవరని ప్రశ్నించారు. ఎనిమిది లక్షల మంది ఓట్లు తీసేయాలని చూస్తున్నారని చెప్పారు. చివరకు నా ఓటు కూడా తీసేస్తారేమో అన్నారు. ఓట్ల తొలగింపుపై ఈసీ, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇప్పుడు మీ ఓట్లు (ఏపీ ప్రజలు) కొట్టేయాలని చూస్తున్నారని, అధికారంలోకి వస్తే మీ ఆస్తులు కొట్టేస్తారన్నారు.
సైబర్ క్రైమ్ చేస్తే వదిలిపెట్టం
వాళ్లకు (వైసీపీ)కి తెలిసిందల్లా దోపిడీ, దొంగతనాలు అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. మోడీ, కేసీఆర్, జగన్.. ఈ ముగ్గురు కలిసినా మనలను ఏం చేయలేరన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడుతానని చెప్పారు. సైబర్ క్రైమ్ చేసే వాళ్లను వదిలి పెట్టమని, కోర్టుకు ఈడుస్తామని చెప్పారు. ఇప్పుడు ఓట్లు తీసేసినంత సులువుగా ఆస్తులు కూడా కొట్టేస్తారన్నారు.