తోక జాడిస్తే ఊరుకునేది లేదు: జగన్కు బాబు వార్నింగ్, కొంతమంది నాకంటే బిజీ
ఎవరితోనైనా పెట్టుకోండని, తన ప్రభుత్వంలో తోక జాడిస్తే కత్తిరిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఎవరితోనైనా పెట్టుకోండని, తన ప్రభుత్వంలో తోక జాడిస్తే కత్తిరిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: మా పార్టీలో వెధవలని వైసిపి నేతే అన్నారు: బాబుకు వంగవీటి రాధా దిమ్మతిరిగే కౌంటర్
అసలు ప్రతిపక్ష పార్టీలకు ఉండటానికి అర్హతే లేదని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టులు కడితే కోర్టుకెళ్లడం, రైతులను రెచ్చగొట్టడం చేస్తున్నారని వైసిపిని ఉద్దేశించి నిప్పులు చెరిగారు. అభివృద్ధి చేస్తుంటే కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు.
ఇన్ని సీట్లు వచ్చినా
వాళ్లలో వాళ్లే కొట్టుకుని అమరావతిలో శాంతి భద్రతల సమస్యలు సృష్తిస్తున్నారని వంగవీటి రాధాకృష్ణ, గౌతమ్ రెడ్డిలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపికి 104, బిజెపికి 4 సీట్లు వచ్చినా అంతా కలిపి 1.6 శాతం ఓట్ల మెజార్టీతో గెలిచామన్నారు.
ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి
ఇటీవల నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో 16 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయంటే అది ప్రజాభిమానమేనని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో నూటికి 80 శాతం మంది ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉండేలా కార్యక్రమాలు చేస్తామన్నారు.
అసంతృప్తిగా ఉంటే ఫోన్ చేస్తాం
ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వారికి ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరించేలా ముందుకు వెళ్తామని చంద్రబాబు అన్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే 1100కు ఫోన్ చేయాలని, మేమే పరిష్కారం చూపిస్తామని, బాగా పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు అన్నారు.
కొంతమంది నాకంటే బిజీ అయ్యారు
ఫోన్ చేస్తామని చేతులు పైకెత్తి ఆమోదం తెలపాలని చంద్రబాబు కోరారు. కొంతమందికి తాను ఫోన్ చేసినా మాట్లాడటం లేదని, వారు తనకంటే బిజీ అయిపోయినట్లున్నారని చమత్కరించారు.