సింధు, గోపీచంద్లకు ఎంతిద్దాం: కేసీఆర్తో చంద్రబాబు పోటీపడతారా?
అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సాయం, కృష్ణా పుష్కరాల నిర్వహణ తీరుపై చర్చిస్తున్నారు. త్వరలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై కూడా చర్చిస్తున్నారు.
దీంతో పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో పలు పరిశ్రమలకు భూకేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించిన సింధు, కోచ్ గోపీచంద్ను అభినిందిస్తూ కేబినెట్ తీర్మానం చేయనుంది. దీనికి తోడు సింధుతో పాటు గోపీచంద్కు ఇవ్వాల్సిన నజరానాలపై కూడా కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. కోటిని బహుమానంగా ఇవ్వనుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు రూ. కోటి పారితోషకం ఇస్తామని టీ ప్రభుత్వం తన క్రీడా విధానంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మేరకు నజరానా ప్రకటిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మాదిరే కొటి ఇస్తారా లేక అంతకంటే ఎక్కువ నగదు రివార్డుని ప్రకటిస్తారా? అనే విషయం కేబినెట్ సమావేశం ముగిస్తే కానీ తెలియదు. మంత్రులతో చర్చించి చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి రజత పతకం సాధించిన పీవీ సింధుకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 2 కోట్లు నజరానా ప్రకటించింది. అదే విధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. అరకోటిని నజరానాగా ప్రకటించింది. ఇక బీఏఐ సింధుకు రూ.50 లక్షలు, గోపీచంద్కు రూ.10 లక్షల నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే.