చంద్రబాబు అవినీతిపై విచారణ చేయాల్సిందే: బీజేపీ నేత డిమాండ్
గుంటూరు: టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిపై విచారణ చేయించాల్సిన బాధ్యత జగన్ సర్కార్ పై ఉందన్నారు బీజేపీ నేత సునీల్ దేవ్ధర్. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయిస్తే ఇక ఆయన నివాసం జైలుకు పరిమితం అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీడీపీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరిందని... విచారణ చేస్తే రెండేళ్లలో చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమని సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే... ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి లాక్కున్న ఘనచరిత్ర చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబు కాస్త చందాలబాబుగా మారారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా పక్కదోవ పట్టించి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. దళితుల అభివృద్ధికి రావెల కిషోర్ బాబు కృషి చేస్తే ఆయన్ను తొలగించి దళిత వ్యతిరేకి అనే ముద్ర చంద్రబాబు వేసుకున్నారన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారన్న సునీల్ దేవ్ధర్... ఏ క్షణమైనా వారు కమలం గూటికి చేరే అవకాశం ఉందనే సంచలన వ్యాఖ్యలు మరోసారి చేశారు.
ఇక బీజేపీ అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పిస్తుందని చెప్పిన సునీల్ దేవధర్.. దళితులకు పెద్దపీట వేసిన పార్టీ బీజేపీ అని పునరుద్ఘాటించారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తిని బీజేపీ రాష్ట్రపతిగా నియమించిందని, దళిత వాడ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందని గుర్తు చేశారు. జాతీయవాదాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచెప్పడమే బీజేపీ ప్రధాన అజెండా అని అన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే మోడీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సునీల్ దేవ్ధర్ వెల్లడించారు.