అరుదైన అవకాశం: ఐఎఎస్లకు లెక్చరర్గా చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు క్లాస్ తీసుకోనున్నారు. గతంలో కూడ పలుమార్లు ఐఎఎస్, ఐపిఎస్ల శిక్షణ శిభిరంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. పాలన తీరుపై పలు సూచనలు చేశారు. ఈ నెల 25వ, తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 1986 బ్యాచ్కు చెందిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు లెక్చరర్ కానున్నారు.
సుదీర్ఘ పాలనానుభవం, సంస్కరణవాదిగా పేరు. హైటెక్ సీఎంగా ప్రఖ్యాతి. ఇన్ని ప్రత్యేకతలున్న చంద్రబాబుకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 25న ముస్సోరిలో యువ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు 1986 బ్యాచ్కు చెందిన ఐఏఎస్లను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ముస్సోరి శిక్షణా సంస్థ డైరెక్టర్ ఆహ్వానం పంపారు. ఈ నెల 25న ఉదయం సీఎం ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి ముస్సోరి వెళ్ళనున్నారు.
సీఎం కార్యాలయంలో ఆయనకు స్పెషల్ ఛీప్ సెక్రెటరిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర కూడా చంద్రబాబు పాఠాలు వినబోతున్నారు. గతంలో కూడా చంద్రబాబు ముస్సోరి వచ్చి ఐఏఎస్ శిక్షణా కార్యక్రమంతో ప్రసంగించారు. ఈ సారి కొత్త బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్లు సుమారు 300 మందిని ఉద్దేశించి చంద్రబాబు పాఠాలు చెప్పనున్నారు.
ప్రధానంగా మూడు అంశాలపై ముస్సోరిలో మాట్లాడాలని బాబు నిర్ణయంచారు. రాష్ట్ర విభజన తర్వాత పాలనా పగ్గాలు అందుకోవడం.. రాజధాని నిర్మించే అరుదైన అవకాశం రావడం.. పరిపాలనలో సాంకేతిక వినియోగంపై చంద్రబాబు మాట్లాడనున్నారు.
రూ. 16 వేల కోట్లు ఆర్థిక లోటు ఉన్న పాలనలో రాజధాని నిర్మించడం అనేది క్లిష్టమైన అంశం. అందులోను తనపై నమ్మకంతోనే సారవంతమైన భూములు 33 వేల 567 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అప్పగించడం ప్రపంచ చరిత్రలో లేదని చంద్రబాబు చెప్పనున్నారు.