జాతీయస్థాయిలో కీలకం: రేపు రాహుల్తో బాబు భేటీ? తెలంగాణలో సీట్ల లెక్క కొలిక్కి వచ్చే ఛాన్స్
అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవలే శనివారం ఆయన దేశ రాజధానిలో పలువురు నేతలను కలిశారు. వారంలోపే మరోసారి పర్యటిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా తదితరులతో ఏపీ సీఎం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
'కాంగ్రెస్తోను కలిసేందుకు సిద్ధం': 2019లో ఏపీలో పొత్తుకు టీడీపీ పచ్చజెండా!
రాహుల్ గాంధీతో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. కానీ ఖరారు కాలేదని తెలుస్తోంది. మరోవైపు, బీజేపీయేతర పార్టీల విషయంలో కేంద్రం అనుసరిస్తునన తీరును చంద్రబాబు వారితో చర్చించనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, బీజేపీయేతర పార్టీల కూటమి వంటి అంశాలపై చర్చించనున్నారు. రాహుల్ గాంధీతో భేటీలో భాగంగా మహాకూటమి సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశముంది.
వారంలో రెండు మూడు రోజులు జాతీయ రాజకీయాలకు కేటాయింపు
చంద్రబాబు నాయుడు ఇక నుంచి వారంలో మూడు రోజుల పాటు జాతీయ రాజకీయాలకు కేటాయించనున్నారు. ఇప్పటికే యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మంగళవారం టీడీపీ అధినేతకు ఫోన్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పని చేస్తామని చెప్పారు. పొత్తుల విషయంలోను టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో పొత్తులకు టీడీపీ సిద్ధమని, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ సహా ఏ పార్టీతో అయినా పొత్తుకు సిద్ధమని చెప్పారు.
జాతీయస్థాయిలో క్రియాశీలక పాత్ర
జాతీయ స్థాయిలో భావసారూప్యం కలిగిన బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే దిశగా చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందుకే వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నారని అంటున్నారు. గురువారం తన ఢిల్లీ పర్యటనలో ఆయన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్తో లంచ్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో మళ్లీ భేటీ అవుతారు.
ఏపీలోని రాజకీయ పరిస్థితులను చెప్పిన చంద్రబాబు
యూపీ సీఎం మంగళవారం చంద్రబాబుకు ఫోన్ చేశారు. కడపలో ఉన్నప్పుడు ఈ ఫోన్ మాట్లాడారు. నిరంకుశ పోకడల నుంచి దేశాన్ని కాపాడాలని, సమాఖ్య స్ఫూర్తికి బీజేపీ గండి కొడుతోందని, ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతోందని, లౌకక వాదం ప్రమాదంలో పడిందని, మీ కృషిని ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, జాతీయస్థాయిలో మీకున్న పరపతితో బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలని, మీకు మేం అండగా ఉంటామని చంద్రబాబుతో అఖిలేష్ అన్నారు. ఏపీ అభివృద్ధిని కూడా ఆయన ప్రశంసించారు. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని, నిరర్థక ఆస్తులు నాలుగున్నరేళ్లలో ఆరేడు రెట్లు పెంచారని, రూపాయి మారకం విలువ పతనమవుతోందని, రైతుల్లో అశాంతి ఉందని, ఒకే భావజాలం ఉన్న పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. అలాగే, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను అఖిలేష్కు తెలిపారు.
ఏపీలో పొత్తు, తెలంగాణలో సీట్లపై తేల్చనున్నారు
ఇప్పటికే తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి. ఏపీలోను కలిసి పని చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పడం కూడా దగ్గర కావడానికి కారణంగా కనిపిస్తోంది. రేపటి భేటీలో తెలంగాణలో పొత్తులతో పాటు సీట్ల అంశాన్ని రాహుల్, చంద్రబాబులు చర్చించి ఓ కొలిక్కి తీసుకురానున్నారని తెలుస్తోంది. జాబితాతో ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ వద్దకు వెళ్లారు. రేపు చంద్రబాబు కలవనున్నారు. పొత్తు నేపథ్యంలో సీట్ల అంశం ఇంకా తేలడం లేదు.