గవర్నర్ ఆహ్వానం: చేతులు కలపనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి చేతులు కలపనున్నారా? అంటే అవుననే అంటున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహాన్ ఇప్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్లను కూడా ఆహ్వానించారు.
వీరితో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నాతాధికారులు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొనాలని ప్రముఖులకు రాజ్భవన్ నుంచి అధికారులు ఆహ్వానాలను పంపారు. స్వయంగా గవర్నర్ నరసింహాన్ ఆహ్వానించడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీమాంసలో పడినట్లుగా తెలుస్తోంది.
గవర్నర్ ఇఫ్తార్ విందుకు వెళ్లాలా? వద్దా? అని అలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు చంద్రులు కలుస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు చంద్రబాబు నాయుడు మకాం మార్చిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు ఇప్పటి వరకు నేరుగా మాట్లాడలేదు. దీంతో వీరిద్దరి కలయికకు ప్రాముఖ్యత సంతరించుకుంది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. 1,95,050 మందికి నూతన వస్త్రాలు పంపిణీ చేయనుంది. అదే రోజు హైదరాబాద్లోని 1000 ప్రాంతాల్లో లక్ష మందికి ఇఫ్తార్ విందు ఇస్తారు. 100 మసీదుల వద్ద 1000 మందికి చొప్పున నూతన వస్త్రాలు పంపిణీ చేస్తారు. 95 నియోజకవర్గాల్లో ఒక్కో చోట 1000 మందికి చొప్పున విందు, 95 వేల కుటుంబాలకు రూ.500 విలువైన వస్త్రాలు అందజేస్తారు.