వట్టి హడావుడే-మిల్లర్లు,వైసీపీ నేతల కుమ్మక్కు-రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలి-జగన్కు చంద్రబాబు లేఖ
తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం అన్నదాతలను నిండా ముంచే విధానాలను అవలంభిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా వారికి బకాయిలు చెల్లించడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు గురువారం(జూన్ 17) లేఖ రాశారు.
టీడీపీ హయాంలోనే 48గంటల్లోనే...
టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేశామని లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు చంద్రబాబు. కానీ జగన్ రెడ్డి పాలనలో ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా ఉలుకూ, పలుకు లేదని విమర్శించారు. రైతులు పంటలు పండించేందుకు చేసిన అప్పులకు వడ్డీలు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఖరీఫ్కు పెట్టుబడులు ఎవరిస్తారని నిలదీశారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.
హడావుడి చేశారు తప్ప... : చంద్రబాబు
ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమలో మొత్తం వేరుశనగ పంట నష్టపోయినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందలేని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పేరుతో హడావుడి చేశారు తప్ప.. రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రాయలసీమలో ధాన్యం కొనుగోళ్లు అరకొరగానే జరిగాయని ఆరోపించారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదన్నారు. సున్నావడ్డీ రుణాలు, పంట బీమా, ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతు భరోసా పథకంలోనూ కౌలు రైతులకు మొండిచేయి చూపించారని అన్నారు.
మిల్లర్లు,వైసీపీ నేతల కుమ్మక్కు
ఈ-క్రాప్లో పంట వివరాల నమోదు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మిల్లర్లు, వైసీపీ నాయకులు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరికే కాకుండా.. ఇతర పంట ఉత్పత్తులకు కూడా మద్దతు ధరలు లభించడం లేదన్నారు. ఆయా పంటలను ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన పంటలకు తక్షణమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.