అరాచక శక్తుల వెనుక పెద్దిరెడ్డి.. 'హింస' యాధృచ్చికం కాదు.. వైసీపీ-పోలీసుల కుమ్మక్కు : చంద్రబాబు
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ నేతలపై దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన స్థానంలో అరాచకం రాజ్యమేలుతుందని విమర్శించారు. పోలీసుల్లో ఒక వర్గం అధికార వైసీపీ నేతలతో కుమ్మక్కై వారి చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు దురదృష్టకరమని.... వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు.
వైసీపీ మాఫియా పడగ విప్పందన్న చంద్రబాబు...
'తంబళ్లపల్లెలో వైసీపీ మాఫియా పడగ విప్పింది. కురబలకోట మండలం అంగళ్లు వద్ద అధికార పార్టీకి చెందిన 200 మంది టీడీపీ నాయకుల వాహనాలపై దాడి చేసి వారిని గాయపర్చారు. ఈ విధ్వంసక దాడి అంతటితో ఆగకుండా ఒక జర్నలిస్టుపై కూడా దాడికి దిగారు. ఈ దాడికి నిరసనగా టీడీపీ శ్రేణులు శాంతియుత నిరసనకు దిగితే పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి బలవంతంగా వారిని అరెస్ట్ చేశారు.అంగళ్లకు 17కి.మీ దూరంలో ఉన్న వాయల్పాడు పోలీస్ స్టేషన్కు టీడీపీ నేతలను తరలించారు.' అని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.
పెద్దిరెడ్డి ప్రోత్సహంతోనే.. : చంద్రబాబు
చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీకి పెద్ది రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని లేఖలో పేర్కొన్న చంద్రబాబు... ఈ ప్రాంతంలో హింసాత్మక రాజకీయాలు యాధృచ్చికం కాదని అన్నారు. దళితులపై అక్కడ జరిగిన దాడులను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ప్రతీ దాడిలో నిందితులు వైసీపీకి చెందినవారేనని... బాధితులు సామాజిక అణచివేతకు గురైన బడుగు బలహీనవర్గాల ప్రజలని పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే అసాంఘీక శక్తుల శిబిరంగా వైసీపీ తయారైందని విమర్శించారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడులు,దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుదేలయ్యేందుకు మరెన్నో రోజులు పట్టదని పేర్కొన్నారు.
Recommended Video
టీడీపీ నేతల హౌస్ అరెస్ట్...
ఇటీవల తంబళ్లపల్లెకి చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు చనిపోగా.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం(డిసెంబర్ 11) పార్టీ నేతలు బయలుదేరారు.ఈ క్రమంలో కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ నేతలపై దాడి జరిగింది. వైసీపీ నేతలే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు శనివారం(డిసెంబర్ 12) 'ఛలో తంబళ్లపల్లె'కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ జిల్లా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతిలో టీడీపీ నేత నరసింహయాదవ్,పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి,కలికిరిలో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తదితర నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఛలో తంబళ్లపల్లె కార్యక్రమానికి అనుమతినివ్వలేదని పోలీసులు తెలిపారు.