వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు.. కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు టీడీపీ, వైసీపీ మధ్య వేడి రాజేస్తున్నాయి. ఆ క్రమంలో ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. ఆ పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు తెలుగుదేశం నేతలు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ కేంద్ర మంత్రికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాయడం చర్చానీయాంశమైంది.
ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇప్పటికైనా ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు త్వరితగతిన రిలీజ్ చేసేలా చొరవ చూపాలని కోరారు. 2014- 19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు.
వామ్మో అవినీతి తిమింగలం.. 10 కోట్లకు పైగా ఆర్టీవో ఆస్తులు..!
ఇక వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పు పడుతూ సదరు కేంద్ర మంత్రికి లేఖలో వివరించారు చంద్రబాబు నాయుడు. పెండింగ్ బిల్లులు చెల్లించడానికి కేంద్రం తన వంతు వాటాగా ఒక వెయ్యి 845 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా చెల్లించాల్సిన నిధులు విడుదల చేయక పోవడం దారుణమని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంపై ఎన్నో కుటుంబాలు ఆధారపడ్డాయని లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు.. తక్షణమే బిల్లులు చెల్లించేలా వైసీపీ ప్రభుత్వంపై వత్తిడి తేవాలని కోరారు. జగన్ సర్కార్ అనుసరిస్తున్న తీరు ఉపాధి హామీ పథకం అమలు స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఉందని చెప్పుకొచ్చారు.