"చంద్రబాబు వల్లే రాష్ట్రంలో కుల వివక్ష!.. విపత్కర పరిస్థితులకు దారితీసేలా"
గత ఎన్నికల్లో దళిత విద్యార్థులకు, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతామని చెప్పిన చంద్రబాబు.. మూడేళ్లలో ఆ హామిని నిలబెట్టుకోపోగా.. ఉన్న హాస్టళ్లనే
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కుల వివక్ష ఎక్కువైందని, బలహీనవర్గాల మీద దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం సొంత జిల్లాలోనే కుల వివక్ష తీవ్ర స్థాయిలో ఉందన్నారు భూమన. చంద్రబాబు తీరు వల్ల గ్రామల్లో ఈ సమస్య విపత్కర పరిస్థితికి దారి తీసేలా తయారైందన్నారు. గత ఎన్నికల్లో దళిత విద్యార్థులకు, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతామని చెప్పిన చంద్రబాబు.. మూడేళ్లలో ఆ హామిని నిలబెట్టుకోపోగా.. ఉన్న హాస్టళ్లనే మూసివేయిస్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు దళిత జాతిని అవమానించారని, సీఎం స్థానంలో ఉండి ఆయనే అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
ఏరోజుకు ఆరోజు పెట్రోలు ధరలు పెరుగుతాయని ప్రకటించే ప్రభుత్వాలు.. విద్యార్థుల మెస్ చార్జీల విషయంలో మాత్రం అలాంటి చిత్తశుద్దిని ఎందుకు ప్రదర్శించడం లేదని భూమన ప్రశ్నించారు. గడిచిన మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య పెరిగినా.. రేషన్ కార్డుల సంఖ్య పెరగలేదని ఆరోపించారు. 2014తో పోలిస్తే.. 2015లో రేషన్ కార్డుల సంఖ్య తగ్గిందన్నారు.
ఇక ఇళ్ల విషయంలోను చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు భూమన. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా.. దళిత వర్గాలకు చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. అదే వైఎస్ హయాంలో 48లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. వైఎస్ హయాంలో 31లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేస్తే.. అందులో దళితులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
కానీ చంద్రబాబు మాత్రం భూసేకరణ పేరిట 10లక్షల ఎకరాలను దళితుల నుంచి లాక్కున్నారని భూమన ఆరోపించారు. పేద ప్రజలకు సంక్షేమ నిధులు ప్రవాహంలా అందాలని, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సరైన రీతిలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయలేకపోయిందని కాగ్ వెల్లడించినట్లు ఈ సందర్బంగా భూమన గుర్తుచేశారు. ప్రతీ సంవత్సరం రూ.10కోట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వం.. గత మూడేళ్లలో రూపాయి కూడా కేటాయించలేదని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.