చంద్రబాబు 50 కోట్లు , మంత్రి పదవి ఇస్తా అన్నారు ... సంచలన ఆరోపణలు చేసిన మంత్రి జయరామ్
ఆలూరు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి గుమ్మనూర్ జయరామ్ చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఆలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన జయరామ్ సీఎం వైయస్ జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. జగన్ తనకు మంత్రి పదవి ఇవ్వటానికి తన నీతి నిజాయితీలే కారణం అని ఆయన పేర్కొన్నారు. ఇక మాజీ సీఎం చంద్రబాబు తనను పార్టీ ఫిరాయింపుకు ప్రోత్సహించాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి.
జగన్ క్యాబినెట్ మంత్రి జయరామ్ కు జగన్ ఆఫర్ అందుకే
ఎవరూ ఊహించని రీతిలో మంత్రివర్యులుగా పదవి దక్కించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం . జయరాం కు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ, కర్మాగారాల మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇక తనకు మంత్రి పదవి రావడానికి గల కారణాన్ని ఆయన తన మాటల్లోనే నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసేలా చెప్పారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గుమ్మనూరు జయరామ్ తన ఆలూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు . ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు డబ్బు పదవి ఆఫర్ చేసి పార్టీ ఫిరాయింపుకు ప్రోత్సహించారన్న మంత్రి జయరామ్
గతంలో చంద్రబాబు నాయుడు పార్టీ మారాలని కోరారని అందుకు రూ.50 కోట్లు డబ్బు, ఒక మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని అయితే దాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పంపిన మధ్యవర్తితో డబ్బు జంతువులను కొనుగోలు చెయ్యటానికి , కానీ తాను జంతువును కాదని చెప్పానని ఆయన అన్నారు. అంతే కాదు మీరు ఆఫర్ చేసే రూ.50 కోట్లు, మంత్రి పదవి నా వెంట్రుకతో సమానం అంటూ తిప్పి పంపిన వ్యక్తినని ఆయన తన పర్యటనలో ప్రజలతో చెప్పుకొచ్చారు. డబ్బుకు అమ్ముడుపోకుండా నీతిగా నిలిచినందుకే వైయస్ జగన్ తనను మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు జయరామ్.
భూమా నాగిరెడ్డి వంటి వాళ్ళు పార్టీ మారినా తాను జగన్ పార్టీకే కట్టుబడి పని చేశా అన్న జయరామ్
కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి వంటి వాళ్లు కూడా చంద్రబాబుకు అమ్ముడు పోయారని సంచలన ఆరోపణలు చేశారు. భూమా నాగిరెడ్డి వంటి వారు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి టీడీపీలో చేరిపోతే తాను మాత్రం చేరలేదని మంత్రి జయరామ్ చెప్పుకొచ్చారు. ఇక తాను నీతిగా , నిజాయితీగా ఉంటూ తన సామాజిక వర్గమైన బోయలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చానంటూ మీసం మెలేశారు జయరామ్. ఇకనైనా బోయ సామాజిక వర్గం నేతలు మారాలని, వై ఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని చెప్పారు. బోయలు వైయస్ జగన్ ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి జయరామ్ సూచించారు.