రామోజీనే సూచించారు, విభజనతోనే అమరావతిపై చర్చ: చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోని 10 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన 'ఆమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు' పుస్తకాన్ని సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాతవాహనాల కాలంలోనే అమరావతి ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందిందని తెలిపారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతాన్ని తర్వాతి కాలంలో పరిపాలించిన వేంకటాద్రి నాయుడు గురించి పుస్తకం తీసుకురావటం అభినందనీయమని అన్నారు.
గతంలో అమరావతి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలిసేది కాదని.. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని గురించి చర్చ మొదలైందన్నారు. రాజధానిలో భవనాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దేశీయ రూపశిల్పులతో ఆకృతులు తయారు చేయిస్తున్నట్లు చంద్రబాబునాయుడు వివరించారు.
తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకలా అమరావతి నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతం నుంచే బుద్దిజం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని.. అందుకే అమరావతిలో అంతర్జాతీయ బుద్ధిజం పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఈ ప్రాంతానికి చెందిన వారసత్వ సంపద లండన్ మ్యూజియంతో పాటు చెన్నై, హైదరాబాద్లోని ప్రదర్శనశాలల్లో ఉందని.. వాటిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రాజధానికి అమరావతి పేరును రామోజీరావు సూచించారని. ఈ పేరు వెనక ఉన్న చరిత్రను, వివరాలను తనకు పంపారని సీఎం గుర్తు చేసుకున్నారు.