ఆనంను ఏం అగౌరవపర్చాం?, ఇద్దరూ ఎమ్మెల్సీ అడగడంతోనే!: నేతలతో చంద్రబాబు
అమరావతి/నెల్లూరు: తాను తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్నానని, అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు నెల్లూరుకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును బుధవారం నెల్లూరు టీడీపీ నేతలు కలిసిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఆనంను ఏం అగౌరపర్చాం?
తనకు పార్టీలో గౌరవం లభించడం లేదని, అందువల్ల పార్టీని వీడుతున్నట్లు ఆనం చెబుతున్నారని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆనం రామనారాయణ రెడ్డిని ఇక్కడ ఏం అగౌరవపర్చాం?, ఆయన ఎందుకు అలా అనుకుంటున్నారు? ఆనంకు తాను గౌరవం ఇవ్వనిదెప్పుడు అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వాలనుకున్నాం
పత్రికల్లో చూశాను, గౌరవం ఇవ్వలేదని ఆనం ఎందుకు అనుకుంటున్నారో తెలియడం లేదని చంద్రబాబు అన్నారు. ఆనంకు సీనియర్టీని దృష్టిలో ఉంచుకునే టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చామని, ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వాలనుకున్నట్లు తెలిపారు.
వివేక కూడా అడగడంతో..
అయితే, అదే సమయంలో ఆనం వివేకానందరెడ్డి కూడా తనను కలిసి ఎమ్మెల్సీ పదవి కావాలని కోరారని, దీంతో ఆనం సోదరులకు ఇద్దరికీ కూడా ఇవ్వలేపోయానని చంద్రబాబు చెప్పారు.
Recommended Video
తాను టీడీపీతోనంటూ ఆనం సోదరుడు
కాగా, తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా.. తనకు సంబంధం లేదని, తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని ఆనం జయకుమార్ రెడ్డి సీఎం చంద్రబాబుకు స్పష్టం చేశారు. పార్టీ మారడంపై ఆనం రామనారాయణ రెడ్డి చెప్పిన కారణం తమకు సబబుగా అనిపించలేదని జయకుమార్ రెడ్డి అన్నారు.